వైకుంఠధామాల నిర్మాణాలను గడువులోగా పూర్తి చేయాలి

Published: Thursday March 18, 2021
జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చ్ 17 ( ప్రజాపాలన ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైకుంఠదామాల నిర్మాణపు పనులను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం దోమ మండలంలోని గడిసింగాపూర్, గొట్లచెల్కతాండ, ధీర్సంపల్లి, కొత్తపల్లి గ్రామాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాలలో చేపట్టిన వైకుంఠదామాల నిర్మాణపు పనులను పరిశీలించారు. అధికారులు, సర్పంచులు కలిసి పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణపు పనుల పూర్తి బాధ్యత గ్రామ సర్పంచులదే అని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఉదయం, సాయంత్రం సమయాలలో పనులను చేపట్టి  పూర్తి అయ్యేలా చూడాలన్నారు. అవసరం మేరకు ఎక్కువ మంది  కూలీలను పెంచి గడువులోగా నిర్మాణపు పనులను పూర్తి చేయాలని సూచించారు. దీనికి సంబందించిన బిల్లులు కూడా త్వరగా చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ డిఓ కృష్ణన్, పి ఆర్ ఏ ఈ ఉమేష్ కుమార్, ఏ ఈ మాణికుమార్, ఎంపిఓ  సురేష్, గ్రామ సర్పంచ్ లు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.