హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర లో భాగస్వాములు కండి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క

Published: Tuesday March 14, 2023
 మధిర , మార్చి 13 ప్రజాపాలన ప్రతినిధి:పట్టణంలోని మల్లు భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మధిర నియోజకవర్గ శాసనసభ్యులు శాసనసభాపక్ష నేత గౌరవనీయులైన మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ....అదిలాబాద్‌ జిల్లాలో బోథ్‌ నియోజక వర్గం బజరహత్నూర్‌ మండలం పిప్పిరి గ్రామంలో పాదయాత్రలో ప్రారంభమై ఖమ్మం జిల్లాలో పాదయాత్ర ముగుస్తుంది.39 అసెంబ్లి నియోజక వర్గాలను టచ్‌ చేస్తూ మొత్తం 1,365 కిలోమీటర్ల మేర యాత్ర చేయనున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి కాంగ్రెస్‌ కార్యకర్త తమ శక్తిమేరకు తనతో నాలుగు అడుగులు వేసి కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని భట్టి పిలుపునిచ్చారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని పాదయాత్రలో ప్రజలకు వివరిస్తామన్నారు. వచ్చే అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ లక్ష్యాలను నెరవేరుస్తామన్నారు. 
 
మూడు బహిరంగ సభలు...
పాదయాత్రలో భాగంగా మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంచిర్యాల, హైదరాబాద్‌ శివారుతో పాటు ఖమ్మంలో పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అవసరాలు, ఆశయాలను కాంగ్రెస్‌ ఎజెండాగా మార్చుకుని ముందుకెళ్లుతుందని, పార్టీ చేస్తున్న పోరాటానికి ప్రగతిశీల ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కవులు, కళాకారులు, తెలంగాణ కోసం పోరాడిన యోధులు తాను చేసే పాదయాత్రలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
 
భట్టి పాదయాత్ర కొనసాగే రూట్‌ మ్యాప్‌....
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఈ నెల 16న చేపట్టే పాదయాత్ర ఉమ్మడి అదిలాబాద్‌ బోథ్‌ అసెంబ్లి నియోజక వర్గం నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి ఖానాపూర్‌, అసిఫాబాద్‌, బెల్లంపల్లి, చెన్నూరు, మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, హుజురాబాద్‌, హుస్నాబాద్‌, వర్దన్నపేట, వరంగల్‌ పశ్చిమ, స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగాం, ఆలేరు, భువనగిరి, ఇబ్రాహీపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, చేవేళ్ల, షాద్‌నగర్‌, జడ్చర్ల, నాగర్‌ కర్నూల్‌, కల్వకుర్తి, దేవరకొండ, మునుగోడు, నల్లగొండ, నకిరెకల్‌, సూర్యాపేట, కోదాడ, ముదిగొండ, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం ఇల్లెందు, ఖమ్మం అసెంబ్లి నియోజక వర్గంలో యాత్ర కొనసాగుతుంది. అక్కడనే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారని తెలిపారు.ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చావా వేణు, మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిర్యాల వెంకటరమణ గుప్తా, ముదిగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్మినేని రమేష్, చింతకాని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు, బోనకల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి దుర్గారావు, ఎరుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, 5 మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.