26న జరిగే భారత్ బంద్ ను జయప్రదం చేయండి

Published: Wednesday March 24, 2021
భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపిన అఖిలపక్ష నాయకులు
మధిర, మార్చి 23, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతూ ఈనెల 26 నిర్వహించనున్న భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిపిఐ సిపిఎం పట్టణ కార్యదర్శులు బెజవాడ రవిబాబు, శీలం నరసింహారావు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, టిడిపి పట్టణ అధ్యక్షులు మల్లాది హనుమంతరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించే విధంగా ఉన్న నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో పాలకులు రైతు ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలన్నారు. దానిలో భాగంగా ఈనెల 26వ తేదీన నిర్వహించనున్న భారత్ బంద్కు అన్ని ఉద్యోగ, కార్మిక సంఘాలు, వర్తక వాణిజ్య వ్యాపారులు సహకరించి జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు కర్నాటి రామారావు, అద్దంకి రవి కుమార్, జహంగీర్ మద్దాల ప్రభాకర్, పడి కంటి మురళి, చెరుకూరి వెంకటేశ్వరరావు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మద్దాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.