పట్లోళ్ళ వెంకట్ రెడ్డి ఖాతాలో రూ.18.52 కోట్లు జమ

Published: Tuesday May 31, 2022
వికారాబాద్ బ్యూరో 30 మే ప్రజాపాలన : 
పట్లోళ్ళ వెంకట్ రెడ్డి హెచ్ డిఎఫ్ సి బ్యాంకు ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18.52 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. తన ఖాతాలోని బ్యాలెన్స్ చెక్ చేసుకుని షాక్‌కు గురయ్యాడు. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా కేంద్రంలో నివసించే పట్లోళ్ళ వెంకట్ రెడ్డి జిల్లా కేంద్రంలో సెవెన్ హిల్స్ మొబైల్ షాప్ నడుపుతుంటాడు. అయితే వికారాబాద్ బ్రాంచ్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి ఇతడి ఖాతాలో ఒక్కసారిగా 18 కోట్ల 52 లక్షల రూపాయలు జమ కావడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇన్ని కోట్ల రూపాయలు తనకు ఎక్కడి నుంచి వచ్చాయి అని వాకబు చేశాడు. పొరపాటున బ్యాంకు నుంచి తన ఖాతాలోకి వచ్చి ఉంటాయని అనుమానించిన వెంకట్ రెడ్డి వెంటనే బ్యాంకు అధికారులకు విషయం తెలిపారు. బ్యాంకు అధికారులు వెంటనే వెంకట్ రెడ్డి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. దీనిపై వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తన ఖాతాలో ఆ డబ్బులు ఎలా పడ్డాయో తెలియదన్నారు. బ్యాంకు అధికారులు అకౌంట్ ఫ్రీజ్ చేయడంతో ఎటువంటి లావాదేవీలు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

తమిళనాడులోని చెన్నైలో కూడా తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు త్యాగరాయనగర్ బ్రాంచ్‌‌కు చెందిన వంద మంది ఖాతాల్లో రూ.13 కోట్ల చొప్పున డ‌బ్బు డిపాజిట్ అయ్యింది. దీంతో విషయం తెలిసి అందరూ బ్యాంకులకు పరుగులు తీశారు. ఎంటీఎంల్లో క్యూలు క‌ట్టారు. సాంకేతిక కారణాలతో కోట్లాది రూపాయలు డిపాజిట్ అయి ఉంటాయని అనుమానించి ఆ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడంతో కస్టమర్లు అవాక్కయ్యారు.