వైకుంఠధామాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
Published: Tuesday January 03, 2023
జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్ బ్యూరో 02 జనవరి ప్రజా పాలన : వైకుంఠధామాలకు నీటి సరఫరా, విద్యుత్తు సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వైకుంఠధామాల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠధామాల్లో నీరు , విద్యుత్తు సదుపాయాల కల్పనకై 226 దరఖాస్తు రాగా ఇప్పటికీ 118 పాలనపరమైన మంజూరు ఇవ్వడం జరిగిందని అన్నారు. విద్యుత్తు, పంచాయతీ శాఖ అధికారులు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి కావలసిన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని ఆయన అన్నారు. వైకుంఠధామాల్లో విద్యుత్తు సరఫరా నిమిత్తం అదనంగా కావల్సిన స్తంభాలు, ఇతర పనుల నిమిత్తం అంచనాలను రూపొందించి సమర్పించాలని అధికారులకు సూచించారు. వైకుంఠధామాల్లో వసతులను కల్పించి సంక్రాంతి లోపు వినియోగంలోకి తీసుకుని వచ్చేందుకు పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో గ్రామీణాభివృద్ధి అధికారి కృష్ణన్, జిల్లా పంచాయితీ అధికారి తరుణ్ కుమార్, మిషన్ భగీరథ ఇఇ. బాబు శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్ఇ. జయరాజు, డివిజనల్ పంచాయతీ అధికారులు అనిత, శంకర్ నాయక్, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: