ప్రజల సమస్యలు పట్టించుకోని ఎమ్మెల్యే

Published: Wednesday July 27, 2022

మంచిర్యాల టౌన్, జూలై 26, ప్రజాపాలన: ప్రజల కష్టాలు, సమస్యలు, అభివృద్ధిని గాలికి వదిలిన ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ,టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేవలం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. మంగళవారం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంపత్ రెడ్డి మంచిర్యాల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ మాట్లాడుతు ప్రజలు ఓవైపు వరదల సమస్యలతో అల్లాడిపోతుండగా వారిని ఆదుకోవాల్సిన టీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ పార్టీపై విమర్శలు, అసత్య ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. వరదల సమయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల  ప్రేమ్ సాగర రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఎంతో సేవ చేయగా టిఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఫోటోలకు దిగడానికే పరిమితమయ్యారని వారు విమర్శించారు. కరోనా సమయంలో కానీ ,వరదలు వచ్చిన సమయంలో గానీ కాంగ్రెస్ పార్టీ ముందుండి ప్రజలకు అండగా నిలిచి సేవలందించిన విషయాన్ని టిఆర్ఎస్ నేతలు విస్మరించరాదని వారన్నారు. మాత శిశు కేంద్రం మునిగిపోతే ఏమవుతుందని టిఆర్ఎస్ నేతలు మాట్లాడడం శో చనీయమని వారు అన్నారు. మాతా శిశు కేంద్రంలోని రోగులను వారి కుటుంబ సభ్యులను వరదలు వచ్చే ఒక రోజు ముందు సురక్షిత ప్రాంతాల్లో తరలించడం ఎంత సమస్యగా మారిందో సేవ చేసిన కాంగ్రెస్ పార్టీ నేతలకే తెలుసని వారు అన్నారు.   ప్రజాసేవలో దూసుకుపోతున్న ప్రేమ్ సాగర్ రావు ను విమర్శించడం నిత్యకృత్యంగా  పెట్టుకుంటే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని వారు సూచించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.