జిల్లా ప్రజల చిరకాల స్వప్నం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం

Published: Wednesday August 11, 2021
వికారాబాద్ బ్యూరో 10 ఆగస్ట్ ప్రజాపాలన: జిల్లా ప్రజల చిరకాల స్వప్నం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్రింద ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం వికారాబాద్ జిల్లా, పరిగి మండలంలోని బృందావన్ గార్డెన్స్ లో జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అధ్యక్షతన నిర్వహించడం జరిగినది.  ఇందులో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేసినారు. ప్రజాభిప్రాయ సేకరణలో 37 మంది సానుకూలంగా మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా వన్య ప్రాణులకు గాని, వృక్ష సంపదకు గాని, జంతు జాలాలకు ఏలాంటి హాని ఏర్పడదని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేసారు.  జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతున్నందున ప్రజలు అందరు సంతోషంగా ఉన్నారని తెలిపారు.  ఇలాంటి ప్రాజెక్ట్ ల వల్ల భూగర్భ జలాలు పెరిగి త్రాగు, సాగునీరు లభించి ఈ ప్రాంత ప్రజలు, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. నీటి సౌలభ్యత వల్ల పారిశ్రామిక రంగం అభివృద్ధి చెంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని వారు తమ అభిప్రాయాలూ వ్యక్తపరిచారు. ఈ పథకం క్రింద భూములు, ఇండ్లు కోల్పోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలనీ భూములు కోల్పోయిన వారికి భూమి, ఇండ్లు కోల్పోయిన వారికి ఇండ్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కుల్కచర్ల మండలంలోని కొన్ని గ్రామాలకు మాత్రమే నీరు అందనున్నందున, మిగితా అన్ని గ్రామ పంచాయతీలకు కూడా సాగు నీరు అందేలా చూడాలని కోరారు. వికారాబాద్ జిల్లాలో ఈ ప్రాజెక్ట్ క్రింద 18 మండలాలలోని 417 గ్రామాలలో ఉద్ధాండాపూర్, కె. పి. లష్మిదేవిపల్లి రిజర్వైర్ ద్వారా సుమారు 3,41,952 ఎకరాలకు సాగునీరును ఉద్ధాండాపూర్ ప్రధాన ఎడమ కాలువ నుండి 16.550, సర్వే ప్యాకేజీ 4 ద్వారా 1,20,000 ఎకరాలకు, మద్దూర్ కాలువ ద్వారా 80,400 ఎకరాలకు సాగు నీరు అందించడం జరుగుతుంది. రైతులు, ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు విలువరించిన సానుకూల అభిప్రాయాలను వీడియో రికార్డింగ్ చేయడం జరిగిందని, వీటితో పాటు కొందరు లిఖిత పూర్వకంగా వ్రాసి ఇచ్చిన అభిప్రాయాలను కాలుష్య నియంత్రణ మండలి వారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పాటు కాలుష్య నియంత్రణ మండలి ఎస్ఈ సురేష్, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్, వికారాబాద్ డివిజన్ ఆర్ డిఓ ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.