పంట రుణాల గురించి ప్రచారం నిర్వహించాలి

Published: Friday April 22, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 21 ఏప్రిల్ ప్రజాపాలన :  కిసాన్ భాగ్యదారి - ప్రాథమికత హమారీ కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద ప్రతి రైతుకు పంట రుణాలు అందే విధంగా అన్ని మండలాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ  కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ప్రయోజనాలను రైతులందరు సులభతరంగా పొందెందుకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో స్పెషల్ డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ సమావేశం (DCC) నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి రైతు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం క్రింద ప్రయోజనాలు పొందే విధంగా చూడాలన్నారు. ఈనెల 24 నుండి మే, 1 వరకు అన్ని మండల కేంద్రాలలో ప్రతి బుధవారం బ్యాంకర్లు, మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖ అధికారులు క్యాంపులు నిర్వహించి రైతులు ప్రయోజనాలు పొందే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. ఈ పథకంతో పాటు PMSBY సురక్ష భీమా యోజన క్రింద రూ.1.60 లక్షలు, PMJJBY జీవన జ్యోతి భీమా యోజన క్రింద రూ. 2.00 లక్షల రుణాలు పొందవచ్చని తెలుపుతూ రైతులకు అవగాహన కల్పించి వారు ప్రయోజనాలు పొందే విధంగా చూడాలన్నారు. ఈ పథకం క్రింద పాడీ పరిశ్రమకు, మత్స్య పరిశ్రమకు కూడా 30 నుండి 40 వేల వరకు రుణాలు కూడా ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే ఇప్పటి వరకు పంట రుణాలు పొందని రైతుల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకర్లకు అందుసజేస్తే అట్టివారికి బ్యాంకర్లు రుణాలు అందజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులు ప్రతిఒక్కరు ప్రయోజనం పొందేలా ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో యల్డియం రాంబాబు, నాబార్డ్ డిడియం ప్రవీణ్ కుమార్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి అనిల్ కుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి దుర్గాప్రసాద్ వ్యవసాయ శాఖ ఏడి స్వరూప రాణి, వివిధ బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు.