ప్రేమ పేరుతో వేధించిన మానవ మృగానికి ఉరిశిక్ష వేయాలి – ధారావత్ ప్రీతి కుటుంబానికి న్యాయం చేయ

Published: Tuesday February 28, 2023

వికారాబాద్ బ్యూరో 27 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రేమ పేరుతో మానసికంగా కృంగే విధంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న ధారావత్ ప్రీతి  మృతికి కారణమైన మొహమ్మద్ సైఫ్ ను ఉరితీయాలని అఖిల భారత గిరిజన సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కరంతోట్ రాఘవన్ నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం నుండి బిజెఆర్ చౌరస్తా వరకు ధారావత్ ప్రీతి మృతికి సంతాపంగా  కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యయత్నం పై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాకతీయ మెడికల్ కాలేజ్ మెడికో విద్యార్థిని ప్రీతి బాయి మరణానికి కారణం అయిన  సైఫ్ ను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాలేజీ హెచ్ ఓ డి, ప్రిన్సిపాల్ లను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొoడ్రాయి గ్రామ  గిరిజన తెగకు చెందిన ధారావత్ నరేందర్ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు. 

ధారావత్ నరేందర్ రైల్వే శాఖలో ఏఎస్ఐ గా పని చేస్తూ తన పిల్లల్ని ప్రయోజకులుగా చేయాలని అనేక కష్టనష్టాలు పడి చదివించుకున్నాడు. 
చిన్న అమ్మాయి డాక్టర్ ప్రీతి ఎంబిబిఎస్ పూర్తి చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనస్థీషియా వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరంలో చేరింది. అయితే గత 15 రోజుల నుంచి తమ సీనియర్ వైద్య విద్యార్థి డాక్టర్ సైఫ్  వేధింపులు ఎక్కువ కావడం వలన ముందుగా ఆమె తల్లిదండ్రులకు తెలిపింది. తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేశారు. అనంతరం డాక్టర్ ప్రీతిని, డాక్టర్ సైఫ్ లను హెచ్ఓడి సమక్షంలో విచారణ జరిపించి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. ఈ విషయానికి సంబంధించి ఎంజిఎం ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ లు విచారణ కమిటీ వేసి డ్యూటీలో ఉన్న సిబ్బందిని కూడా విచారించినట్లు సమాచారం. 22-2-2023 బుధవారం ఎంజీఎం ఆసుపత్రిలో ఉదయం ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రీతి అక్కడే కుప్పకూలిపోయింది. ఇంజక్షన్ ఎక్కువ మోతాదు తీసుకున్నదని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు 22-2- 2023 న మధ్యాహ్నం హడావిడిగా తరలించగా ఉచ్వాస-నిశ్వాసల మధ్య జరిగిన పోరాటంలో చివరి శ్వాసను నిన్న రాత్రి ( ఆదివారం ) వదిలింది. అమ్మాయిలను వేదించే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపల్, హెచ్ఓడి ల నిర్లక్ష్యం క్షమించరానిది. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొవాలని అదే విదంగా  ఈ సంఘటనకు పూర్తి కారకుడైన సైఫ్ కు ఉరి శిక్ష వేయాలని  రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.