వివిధ పార్టీల నుండి 40 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

Published: Thursday October 14, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 13, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల్ మండల పరిధిలోని పటేల్ చెరువు తండాకు చెందిన 40మంది యువకులు బుధవారం వివిధ పార్టీల నుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపదలో వచ్చినా ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధే లక్ష్యంగా ఈ ప్రాంతం కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రజా నాయకునికి అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీలో స్వచ్ఛందంగా చేరామని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం మా శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పని చేయాలని కోరారు. మీకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటేల్ చెర్వు తండా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గణేష్ నాయక్, పార్టీలో చేరిన యువకులు మరియు ఎం ఎన్ ఆర్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.