నువ్వు నా కాళ్లు పట్టుకుంటేనే హైదరాబాద్ పోయాను.. వేలకోట్లు ఎలా సంపాదించావో ప్రజలకు సమాధానం

Published: Monday April 10, 2023
 తల్లాడలో విలేకరుల సమావేశంలో పిడమర్తి రవి..
తల్లాడ, ఏప్రిల్ 9 (ప్రజా పాలన న్యూస్):
సీఎం కేసీఆర్ తో మాట్లాడి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నీకు రెన్యువల్ చేయిస్తా.. హైదరాబాద్ పో అని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నా కాళ్లు పట్టుకుంటేనే నేను అక్కడికి వెళ్లానని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా తల్లాడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అప్పటి నియోజకవర్గ ఇన్చార్జ్ నూకల నరేష్ రెడ్డి, మువ్వ విజయబాబు సమక్షంలో సండ్ర నాకు పదవి రెన్యువల్ చేయిస్తానని కాళ్లు పట్టుకుంటేనే హైదరాబాద్ వెళ్లానన్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం అనేకసార్లు జైలుకు వెళ్లానని గుర్తుచేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో ఏఈలు, డీఈలు నాకు తెలియదని అంటున్నావుగా నీలాగా నేను కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు తీసుకోనని ఆరోపించారు. ఒకప్పుడు నీ ఆస్తులెంతా..? నీ పరిస్థితి ఏంది.. ఇప్పుడు నీ ఆస్తులెంతని ప్రశ్నించారు. హైదరాబాదు, ఆంధ్ర, బెంగుళూరు, సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో ఇల్లు, ప్లాట్లతో పాటు వేల కోట్లు ఎలా వచ్చాయన్నారు. ఎన్నికల్లో నేను పోటీ చేసేటప్పుడు నా పార్టీ  వాళ్ళను మాత్రమే అడిగానని, నీలాగా అన్ని పార్టీల దగ్గరకు వెళ్లి అడగలేదన్నారు. పగులు సంసారం, రాత్రి వ్యభిచారం లాగా నేను చేయలేదన్నారు. ఓటుకు నోటు కేసులో పట్టపగలే దొరికిన దొంగవి నువ్వు అన్నారు. అన్ని పార్టీల నాయకులను మోసం చేసింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. మరోసారి తనపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకోమని, రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన ఘాటుగా హెచ్చరించారు. అనంతరం సర్పంచుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారపోగు వెంకట్, నాయకులు గణేశుల రవి, యర మల వెంకటేశ్వర్ రెడ్డి, మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, తుమ్మలపల్లి రమేష్, తూము వెంకటనారాయణ, ఎర్రి నరసింహారావు, రాఘవరెడ్డి, పొట్రు శ్రీనివాసరావు, మాగంటి శ్రీను, గోవిందు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.