ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న విడుదల చేసేలా చర్యలు

Published: Thursday October 28, 2021
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 27, ప్రజాపాలన : ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం - 2022 (ఎస్.ఎస్.ఆర్.) ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1న అన్ని జిల్లాలలో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకో వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుండి ఎస్.ఎస్. ఆర్-2022 పై వీడియో కాన్ఫెరెన్సు ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ సెప్టెంబర్, 30వ తేదీ వరకు వచ్చిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించి నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని, అట్టి ప్రతులను అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని, పేర్కొన్నారు. ఓటర్లకు జాబితాలో ఏమైనా మార్పులు, చేర్పులు, ఫోటో లేకపోవడం ఇతరత్రా సమస్యలు ఉంటే దరఖాస్తులు స్వీకరించి నవంబర్ 2 నుండి సరిచేసే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ఓటర్ల అభ్యంత రాలను పరిష్కరించి 2022 జనవరి, 5 న తుది ఓటరు జాబితాను ప్రచురించాల్సిందిగా సూచించారు. ఓటర్ల చిరునామా మారడం, పోలింగ్ కేంద్రం వేరే చోటికి మార్చవలసినవి, అదనపు పోలింగ్ కేంద్రాలు అవసరం ఉన్న ప్రాంతాలలో స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి ఆమోదంతో తగు మార్పులకు సిఫారసు చేయవచ్చని తెలిపారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వివరాలు, ఓటర్ల వివరాల మార్పులు, చేర్పులు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం గరుడ యాప్ను అందుబాటులో ఉంచడం జరిగిందని, ఈ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు పూర్తి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. ఈ.వి.యం.లు పాత గోదాముల నుండి కొత్త గోదాములకు మార్చాలని, ఇంకా నిర్మాణం పూర్తి చేయని జిల్లాల్లో త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. ఈ.వి.యం.ల భద్రతపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలని, అన్ని జిల్లాలలో స్వీప్ యాక్టివిటి నిర్వహించి సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విస్తృత ప్రచారం నిర్వహించడం ద్వారా ఓటర్లను చైతన్యవంతులను చేయాలని తెలిపారు. జనవరి 1, 2022 నాటికి 18 సం॥లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఆన్లైన్ ద్వారా కాని, ఫారం-6 ద్వారా కాని ఓటరు జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకునే విధంగా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గత ఎన్నికలకు సంబంధించి ఖర్చు చేసిన ఎన్నికల బిల్లులు, డి.సి. బిల్లుల సమర్పణలో పెండింగ్ ఉంటే సత్వరమే దాఖలు చేయాలని తెలియజేసారు. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ జిల్లాలో ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులపై ప్రజలకు తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి వేణు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.