కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు ఖాయం

Published: Wednesday April 27, 2022
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 26 ఏప్రిల్ ప్రజాపాలన : రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 సీట్లలో గెలవనున్నామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ జోస్యం చెప్పారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సాకేత్ నగర్ లోగల మాజీ మంత్రి స్వగృహంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ మే 6, 7వ తేదీలలో రైతు సంఘర్షణ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి 8000 మంది రైతులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు పూర్తిగా రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రైతుబంధు 2 ఎకరాల లోపు వారికే సిఎం కెసిఆర్ వర్తింపజేస్తున్నాడని దెప్పిపొడిచారు. ప్రస్తుతం ఎరువుల ధరలు ఆకాశాన్ని అంటే విధంగా 1250 రూపాయలకు చేరిందని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు జీరో పర్సెంటేజ్ వడ్డీకి రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టిపిసిసి అధ్యక్షులు నిరుద్యోగ యువతతో సమావేశం కానున్నారని వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ గెలుపుకు పునాదిగా మారుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి మైపాల్ రెడ్డి మాజీ పిఎసిఎస్ చైర్మన్ కిషన్ నాయక్ దారుర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బ్లాక్ అధ్యక్షుడు అనంత రెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ చాపల శ్రీనివాస్ ముదిరాజ్ చామల రఘుపతి రెడ్డి ఎర్రవల్లి జాఫర్ రెడ్యా నాయక్ అవుటి రాజశేఖర్ నర్సింలు రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.