ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి

Published: Tuesday March 14, 2023
* రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 13 మార్చి ప్రజాపాలన :  రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించు ఇంటర్ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి జిల్లా కలెక్టర్లు, సంభందిత అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , ప్రిన్సిపాల్ సెక్రటరీ నవీన్ మిట్టల్,  విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణలతో కలిసి ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, సంభందిత అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్థేశించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్ వార్షిక పరీక్షలను కట్టుదిటమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో, పకడ్బందీగా నిర్వహించాలని, అవసరమైన ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేసుకొని విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ లు నిరంతరం పర్యవేక్షిస్తూ పరీక్షలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటర్ పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేకంగా టెలీ మానస్ టోల్ ఫ్రీ నెంబర్ 14416 ను ఏర్పాటు చేసిందని, పరీక్షల సమయంలో ఆందోళనకు, టెన్షన్ కు గురయ్యే విద్యార్థులు 14416 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే మానసిక నిపుణులు, వైద్యులు ఉచిత కౌన్సిలింగ్ నిర్వహిస్తారని, ఈ సదుపాయం పై విద్యార్థుల్లో విస్తృత ప్రచారం కల్పించాలని, అలాగే  రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరిగిందని, 040-24601010,  నెంబర్ నందు సందేహాల నివృత్తి కోసం సంప్రదించాలని, ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా కంట్రోల్ రూం లు ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.  విద్యా సంస్థలు విద్యార్థులకు హాల్ టికెట్ల జారీ విషయంలో ఇబ్బంది పెట్టవద్దని సూచించారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టడం జరిగిందని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు  సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది,  విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా  త్రాగునీరు విద్యుత్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు.  పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా  వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.  ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ,  ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 వరకు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని,   అన్ని పరీక్ష కేంద్రాల వద్ద మున్సిపల్, జిల్లా పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యంతో పాటు  త్రాగునీటి సదుపాయం కల్పించాలని అన్నారు. విద్యార్థులు పరీక్షలకు సకాలంలో హాజరయ్యే విధంగా అన్ని రూట్లలో బస్సులను సకాలంలో నడపాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు.   విద్యార్థులకు కళాశాల యాజమాన్యాలు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా హాల్ టికెట్లు అందించాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే స్టేట్ టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ నెంబర్ 040-24601010, 24655027 లకు సంప్రదించాలని, అలాగే మానసిక సమస్యలు, భయం ఆందోళనలు ఉంటే 14416 నెంబర్ కు సంప్రదిస్తే సైకాలజిస్టులో సలహాలు, కౌన్సిలింగ్ అందజేస్తారని  కలెక్టర్ తెలిపారు. జిల్లా కేంద్రంలో కూడా విద్యార్థులకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేయడం జరిగిందని 9642831424, 9963356062 లను కూడా సంప్రదించవచ్చని అన్నారు.  విద్యార్థులకు ఉదయం 8:30 గంటల నుండి పరీక్ష కేంద్రాలలో అనుమతించడం జరుగుతుందని, విద్యార్థులందరూ 8:45 గంటలకు చేరుకోవాలని, 9:00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష  కేంద్రాలలో అనుమతించబడదని కలెక్టర్ సూచించారు. ఈరోజు నుండి విద్యార్థులు నేరుగా tsbie.cgg.gov.in వెబ్ సైట్  ద్వారా కూడా తమ హాల్ టికెట్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. జిల్లాలో మొత్తం 30 ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంటర్ మొదటి సంవత్సరంలో  9231 ద్వితీయ సంవత్సరంలో 8657 మంది మొత్తం 17,888 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ మురళీధర్, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ శంకర్ నాయక్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి పాల్వాన్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక దేవి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కోటాజి, తాండూర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజా మోహన్ రావు, జూనియర్ లెక్చరర్ బుచ్చయ్య తో పాటు ఆర్టీసీ, పోస్టల్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.