తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాం!

Published: Friday October 28, 2022

ఎర్రుపాలెం అక్టోబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి)  తెలంగాణ రాష్ట్రంలో వైయస్ షర్మిల నాయకత్వంలో రాజన్న రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్కినేని సుధీర్ మధిర నియోజకవర్గ కోఆర్డినేటర్ రిటైర్డ్ సీఐ డాక్టర్ మద్దెల ప్రసాదరావు పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని జమలాపురం గ్రామంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ మధిర నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ టిఆర్ఎస్ ఎనిమిదేళ్ళ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా వైయస్సార్ తెలంగాణ పార్టీని ప్రజల గుర్తించి తెలంగాణలో వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారని వారు గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రశ్నించే ప్రతిపక్షాలు లేకపోవడంతో వైయస్ షర్మిల ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలి అనే నినాదంతో షర్మిలమ్మ ఆదేశాల మేరకు ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని వారు కోరారు. అదేవిధంగా మధిర నియోజకవర్గంలో గ్రామ కమిటీలను బూత్ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రైతులకు ఒకే సారి రుణమాఫీ చేశారని, పత్తి విత్తనాల ధరలను తగ్గించారని, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104, ఉచిత విద్యుత్, ప్రాజెక్టుల నిర్మాణం అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వటం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, మైనార్టీలకు రిజర్వేషన్లు అందించారని వారు గుర్తు చేశారు. ప్రస్తుత టిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ భృతి లేదని, రుణమాఫీ లేదని, ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కావాలంటే షర్మిలమ్మ రావాలని నినాదాన్ని గ్రామ గ్రామాన మారుమ్రోగే విధంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్ టిపి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు చల్లా ప్రతిభా రెడ్డి మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ మస్తాన్ పాషా నియోజకవర్గ అధికార ప్రతినిధి వర్రీ మరియదాసు ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు, చింతకాని, ముదిగొండ మండలాల అధ్యక్షులు వేమిరెడ్డి మల్లారెడ్డి, ఐలూరి ఉమామహేశ్వర్ రెడ్డి, షేక్ మౌలానా, వాకా వీరారెడ్డి, సామినేని రవి ఎస్సీ సెల్ మధిర నియోజకవర్గ అధ్యక్షులు ఇరుగు జ్ఞానేష్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు గడపవరపు మురళి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఇస్మాయిల్ సోషల్ మీడియా అధ్యక్షులు శౌరి తదితరులు పాల్గొన్నారు.