ప్రతి ఒక్కరికి మెరుగైన ప్రభుత్వ వైద్యం.

Published: Wednesday February 02, 2022
ఒక్కొక్క వైద్య కళాశాలకు 200 కోట్ల , ఆసుపత్రికి 300 కోట్ల కేటాయింపు
ఈ విద్యా సంవత్సరంలోనే వైద్య కళాశాలలు ప్రారంభించేందుకు చర్యలు 
రాష్ట్ర మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి
మంచిర్యాల బ్యూరో‌, ఫిబ్రవరి 1, ప్రజాపాలన : ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ, శాసన వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాల నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్రావు, రోడ్లు భవనాల శాఖ అధికారి గణపతి రెడ్డిలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అనేక రంగాలలో ప్రథమ స్థానంలో నిలబెట్టడం జరిగిందని, వైద్య రంగంలో సైతం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని రాష్ట్రం నలుమూలలా నిరుపేదలకు కూడా అందించేందుకు వైద్యులను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఒక్కొక్క వైద్య కళాశాలకు 200 కోట్ల రూపాయలు, ఆసుపత్రికి 300 కోట్ల రూపాయల చొప్పున రాష్ట్రంలో మంచిర్యాల, రామగుండం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, వనపర్తి మహబూబ్నగర్, సంగారెడ్డి 8 ప్రాంతాలలో వైద్య కళాశాలలకు 4 వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని తెలిపారు. మొదటి విడతలో వైద్య కళాశాలలు, రెండవ విడతలో ఆసుపత్రులు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలోనే వైద్య కళాశాలలు, ప్రారంభించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని, ఎం.బి.బి.ఎస్. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడంతో పాటు ప్రధాన ఆసుపత్రి భవన నిర్మాణానికి ముఖ్యమంత్రిచే శంఖుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. మెడికల్ కాలేజ్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు మే నెలలోగా అనుమతి పొందిన అనంతరం ఆగస్టు నెల వరకు ప్రారంభానికి చర్యలు చేపడుతున్నామని, 60 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా పనులను ఏప్రిల్ 15వ తేదీ లోగా పూర్తి చేసే విధంగా కార్యచరణ రూపొందించి ప్రణాళికబద్దంగా అమలు చేసేలా ఆదేశించడం జరిగిందని తెలిపారు. ప్రతి నిరుపేదకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ క్రమంలో వరంగల్ ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని 1100 కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, హైదరాబాద్ పరిధిలో గడ్డిఅన్నారం, అల్వాల్, ఎర్రగడ్డ ప్రాంతాలలో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు ఒక్కొక్క సూపర్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని 800 కోట్ల రూపాయల చొప్పున నిర్మించడంతో పాటు ఒక్కొక్క నర్సింగ్ కళాశాలను 40 కోట్ల రూపాయల చొప్పున 14 నర్సింగ్ కళాశాలలను 560 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణానికి నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని పేదలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు దాదాపు 10 వేల కోట్ల రూపాయల ప్రణాళికతో ముఖ్యమంత్రి ముందడుగు వేయడంతో పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేటాయించిన వైద్య కళాశాల నిర్మాణంపై జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పర్యవేక్షణ జరిపి త్వరితగతిన నిర్మాణం వినియోగంలోకి వచ్చే విధంగా సహకరించాలని తెలిపారు. ప్రతి కళాశాలలో తరగతిలో 150 అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుందని, ఏరియా ఆసుపత్రిలో 275 పడకలు, మాతా, శిశు కేంద్రంలో 100 పడకలు అందుబాటులో ఉన్నాయని, మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.