ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి

Published: Tuesday February 14, 2023
వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 13 ఫిబ్రవరి ప్రజాపాలన : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చేసిన ప్రజల నుండి వారి సమస్యలపై 251  ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు. ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేసి వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, పెండింగ్ లో ఉంచరాదని అన్నారు. అంతకుముందు కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్యాంటీన్ లో నాణ్యమైన ఆహారంతో పాటు, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదన కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.