ఎమ్మెల్యే సండ్రకు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం.. ఎనిమిదో రోజు దీక్షకు కాంగ్రెస్ సంఘీభావం..

Published: Thursday March 02, 2023
కల్లూరు, మార్చి 1 (ప్రజా పాలన న్యూస్):
 కల్లూరు డబుల్ బెడ్ రూమ్ ల లాటరీ విధానంలో అవకతవకలు జరిగాయని గత ఎనిమిది రోజులుగా మహిళలు రిలే నిరాహారదీక్షలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పట్టించుకోకపోవడం శోషనీయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. బుధవారం కల్లూరులో జరుగుతున్న దీక్షలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజల ఓట్లు కావాలి కానీ సమస్యలు పట్టించుకోరా అని విమర్శించారు. ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతారు కానీ సమస్య వచ్చినప్పుడు ఎందుకు పట్టించుకోవటం లేదని నిలదీశారు. నిత్యం రోడ్లపైనే తిరుగుతున్న ఎమ్మెల్యే ఎనిమిది రోజులుగా మహిళలు దీక్షలు చేస్తుంటే ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఓటుతోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ హయంలో ప్రజలందరికీ మంచి జరుగుతుందని వారు ధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ రాష్ట్ర కార్యదర్శి భూక్య శివకుమార్ నాయక్, ఎంపీటీసీ లక్కిరెడ్డి గోపిరెడ్డి, జిల్లా నాయకులు దామల రాజు, కిసాన్ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కర్నాటి వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ జానీ పాషా, తదితరులు సంఘీభావం ప్రకటించిన వారిలో ఉన్నారు.