ఆశా వర్కర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి

Published: Tuesday November 29, 2022
మంచిర్యాల టౌన్, నవంబర్ 28, ప్రజాపాలన: ఆశా వర్కర్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ సి ఐ టి యు  ఆధ్వర్యంలో సోమవారం రోజున హజిపూర్ మండలం గుడిపేటలోని జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేసి అనంతరం జిల్లా వైద్య శాఖ అధికారి వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్ సి ఐ టి యు జిల్లా కార్యదర్శి, సమ్మక్క ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మాట్లాడుతూ గతంలో  పలు సమస్యలు పరిష్కరించాలని జిల్లా వైద్య శాఖ అధికారి దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని, అధికారి కూడా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్న సమస్యలు పరిష్కారం కాలేదని ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం  జరిగిందని అన్నారు. ఆశా వర్కర్స్ ఎదుర్కొంటున్నా సమస్యలు పరిష్కరించి పెండింగ్ పి ఆర్ సి ని వెంటనే చెల్లించాలని.
అర్హులైన ఆశాలను రెండవ  ఎ ఎన్ ఎం  లుగా ప్రమోట్ చేయాలని టార్గెట్ల పేరుతో వేధింపులు ఆపాలని రూ.20 లక్షలు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా కోశాధికారి సరోజ, ఉపాధ్యక్షురాలు అరుంధతి, లీలా, రాణి, కవిత, స్వరూప తదితరులు పాల్గొన్నారు.