తండా పంచాయతీలను అభివృద్ధి చేయడమే లక్ష్యం : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Friday August 05, 2022

వికారాబాద్ బ్యూరో 04 ఆగస్టు ప్రజా పాలన : కొత్తగా ఏర్పడిన షాపూర్ తండా గ్రామపంచాయతీలో మురుగు కాలువల నిర్మాణాన్ని చేపట్టాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సూచించారు. గురువారం మర్పల్లి మండల పరిధిలోని షాపూర్ తండాలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా మండల టిఆర్ఎస్ ప్రెసిడెంట్ నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సమక్షంలో గల్లి గల్లి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తండాల అభివృద్ధి కోసమే తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గ్రామంలోని శానిటేషన్ సరైన పద్దతిలో చేయాలని, మళ్ళీ శానిటేషన్ సమస్యలు పునరావృతం అయితే చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. గ్రామంలో రోడ్లపై నీరు పారడంతో మురుగు కాలువల నిర్మాణానికి కృషి చేద్దామన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇవ్వాలని, నెలకు మూడు సార్లు వాటర్ ట్యాంక్ ను కచ్చితంగా శుభ్రం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేసి, గ్రామంలో పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, అవసరమైన చోట స్థంబాలను ఏర్పాటు చేయాలని, గ్రామంలో విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలని, వాటిని వాడుకలో పెట్టుకోవాలని, బహిరంగ మల విసర్జన చేయరాదని ప్రజలకు సూచించారు. గ్రామంలో ప్రతి బుధవారం పశువైద్య అధికారి అందుబాటులో ఉండాలని పశు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం సందర్భంగా గ్రామంలో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అనారోగ్యాలకు గురికారాదని ప్రజలకు సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి, గ్రామ సమీపంలో ఉన్న భారీ వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టును పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.