పిఎస్ పరిధి మార్చండి

Published: Saturday December 10, 2022
బంజారా జిల్లా అధ్యక్షుడు భానుపవార్
వికారాబాద్ బ్యూరో 9 డిసెంబర్ ప్రజా పాలన : మిత్రానగర్ కాలనీని యాలాల్ పోలీస్ స్టేషన్ నుండి తాండూర్ పోలీస్ స్టేషన్ కు మార్చాలని బంజారా జిల్లా అధ్యక్షుడు భానుపవార్ కలెక్టర్ కార్యాలయంలోని అడ్మినిస్ట్రేషన్ అధికారి అమరేందర్ కృష్ణకు వినతి పత్రం ఇచ్చామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిత్రానగర్ కాలనీ తాండూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందుతుందని చెప్పారు. మిత్ర నగర్ కాలనీ నుండి తాండూర్ పోలీస్ స్టేషన్ కు మధ్య దూరం కేవలం ఒక్క కిలోమీటర్ మాత్రమే ఉన్నదని వివరించారు. వాస్తవానికి మిత్రా నగర్ కాలనీ యాలాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. మిత్ర నగర్ కాలనీ నుండి యాలాల్ పోలీస్ స్టేషన్ కు మధ్య దూరం 15 కిలోమీటర్లు ఉంటుందని వెల్లడించారు. శాంతి భద్రతల దృష్ట్యా మిత్రా నగర్ కాలనీని తక్కువ దూరంలో ఉన్న తాండూర్ పోలీస్ స్టేషన్ కు మార్చాలని కోరారు. పోలీస్ స్టేషన్ మార్పు గురించి తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి వినతి పత్రం అందజేశామని తెలిపారు. మానవతా దృక్పథంతో ఆలోచించి మిత్రానగర్ కాలనీవాసుల సమస్యను సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.