అటవీ శాఖ అధికారులు రైతులను ఇబ్బందులు పెట్టొద్దు

Published: Tuesday June 14, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో జూన్ 13 ప్రజాపాలన : అటవీశాఖ అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ సూచించారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని మదన్ పల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ విజయరాజ్ ముదిరాజ్, కార్యదర్శి కిషన్ రెడ్డి, పిఏసిఎస్ డైరెక్టర్ సోమిరెడ్డిల ఆధ్వర్యంలో ఉదయం 6:30 గంటల నుండి 10:15 గంటల వరకు పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
మదన్ పల్లి గ్రామంలో దాదాపుగా 40O వందల మంది రైతులు అసైన్డ్ భూములపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, వర్షాకాలం రావడంతో పంటలు పెట్టుకోవడానికి అటవీశాఖ అధికారులు భయాందోళనకు గురి చేస్తున్నారని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఎమ్మెల్యే స్పందిస్తూ రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి అసైన్డ్ భూముల్లో పంటలు వేసుకునేందుకు రైతులను ఇబ్బంది పెట్ట రాదని సూచించారు. అటవీ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు సమీక్ష చేసుకుని  రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యను పరిష్కారించాలని స్పష్టం చేశారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పాడుబడ్డ ఇండ్లు, పెంట కుప్పలు, పిచ్చి మొక్కలు, ఖాళీస్థలాల పరిశుభ్రత, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.  గ్రామంలో వెంటనే థర్డ్ వైర్ ఏర్పాటు చేసి పాత ఐరన్ స్తంభాలను తొలగించాలని చెప్పారు. నూతనంగా ఏర్పాటు చేసిన  విద్యుత్  స్థంబాలకు వైర్లు ఏర్పాటు చేయాలన్నారు. పాత స్థంబాలు తొలగించి, వెంటనే విద్యుత్ సరఫరా అందించాలని వెల్లడించారు. గ్రామంలో పంటపొలాల్లో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మంచినీటి నల్లా కనెక్షన్ ప్రతీ ఇంటికి కచ్చితంగా ఇవ్వాలని తెలిపారు. గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి అన్ని వార్డులకు సరిపడా నీటిని అందించాలని అన్నారు. ఎక్కడ కూడ లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు  పరిశీలన చేసి నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రజలు సురక్షితమైన మిషన్ భగీరథ మంచి నీటినే త్రాగాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారెగూడెం కమాల్ రెడ్డి, జడ్పిటిసి ప్రమోదినిరెడ్డి, ఎంపిడిఓ మల్గ సత్తయ్య, ఎంపిఓ నాగరాజు, ఎపిఓ శ్రీనివాస్, ఎపిఎం లక్ష్మయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.