మన ఊరు మనబడి పనులు వేగవంతం చేయాలి

Published: Saturday December 10, 2022
జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్ బ్యూరో 9 డిసెంబర్ ప్రజా పాలన : మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి 10 రోజులలో పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మన ఊరు మనబడి పనుల పురోగతిపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ మండలాల వారిగా సమీక్షిస్తూ జిల్లాలో మొదటి విడతగా మండలానికి రెండు పాఠశాలలు చొప్పున 19 మండలాలకు మంజూరైన 38 మోడల్   పాఠశాలను పది రోజులలో అన్ని హంగులతో  సిద్ధం చేయాలన్నారు. ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ క్రింద చేపట్టిన ప్రహరి గోడలు, కిచెన్ షెడ్ లు, మరుగుదొడ్ల నిర్మాణాలతో పాటు ఇతర పనులన్నీ పూర్తిచేసి పాఠశాలలకు కలరింగ్ పనులు చేపట్టి అందంగా తీర్చిదిద్దాలన్నారు. మిగిలి ఉన్న పనులకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నాయని, చేపట్టిన పనులకు వెంటనే యఫ్ టీ ఓ లు అప్లోడ్ చేయాలని సూచించారు. డిసెంబర్ మసాంతం వరకు అన్ని హంగులతో పాఠశాలలను సుందరీకరించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు.
*డబల్ బెడ్ రూమ్ పనులను పూర్తి చేయాలి :
 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అన్ని మౌలిక వసతులతో లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబధిత అధికారులను ఆదేశించారు.  జిల్లాలో పురోగతిలో ఉన్న డబుల్ బెడ్ రూంలో విద్యుత్తు, డ్రైనేజీ, రోడ్లు, నీటి సదుపాయం లాంటి అన్ని మౌలిక వసతులతో జనవరి 10వ తేదీ వరకు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ రాజ్, ఆర్ & బి, ఇరిగేషన్, టీఎస్ ఇ డబ్ల్యూ ఐ డి సి శాఖల ఇఇ లు,  డిఇ లు, ఏఇ లు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు  తదితరులు పాల్గొన్నారు.