పూడూరు మండల కేంద్రంలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
Published: Thursday December 22, 2022
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో 21 డిసెంబర్ ప్రజా పాలన : రాష్ట్రంలోని 9 జిల్లాల్లో శ్రీకారం చుట్టిన కెసిఆర్ న్యూట్రీషియన్ కిట్ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గము పూడూరు మండల కేంద్రంలో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ల పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి నుంచి వర్చువల్గా ప్రారంభించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పూడూరులో జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి, ఎమ్మెల్యేలు మహేష్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నిఖిల, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వర్చువల్ గా హాజరైన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అనంతరం మహిళలకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో శ్రీకారం చుట్టిన కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుందని స్పష్టం చేశారు. యావత్ మహిళా లోకం తరపున మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు ముఖ్యమంత్రికి ఉండాలన్నారు. 9 జిల్లాల్లోని గర్బిణులకు పంపిణీ చేయనున్న కిట్లకు సంబంధించి రూ. 50 కోట్లతో గర్బిణులకు వరంగా మరో అద్భుతమైన పథకమని కొనియాడారు.
అడబిడ్డలు ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యకరమైన సమాజం నిర్మితం అవుతుందని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. రక్త హీనత తక్కువగా ఉన్న 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. అత్యధికంగా ఎనీమియా (రక్త హీనత) ప్రభావం ఉన్న 9 జిల్లాలలో వికారాబాద్ జిల్లాలో ఎనీమియా వికారాబాద్ 79 శాతంగా ఉందని గుర్తు చేశారు. 9 జిల్లాల్లో 1.25 లక్షల మంది గర్బిణీలకు ఇది ఉపయోగపడనుందని చెప్పారు. మొత్తంగా రెండున్నర లక్షల కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం రూ. 50 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు.9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. వికారాబాదులో 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 యూపిహెచ్సి లలో4461 మందికి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. భారత దేశ మహిళలది ప్రపంచంలోనే గొప్ప సంస్కృతి అని వివరించారు. ఒక తల్లిగా, భార్యగా, సోదరిగా, కోడలిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎప్పుడు తన కుటుంభం గురించి ఆలోచిస్తుందన్నారు. కేసీఆర్ కిట్ తో సామాజిక కోణం కూడా ఉందని అడబిడ్డలకు ఒక మేన మామా లాగా ఒక అన్న గా,చిన్నారులకు తాత గా ముఖ్యమంత్రి కేసీఆర్ మరారన్నారు.
ప్రతి పి హెచ్ సి లో ప్రజాప్రతినిధులు హాజరై కిట్లను పంపిణీ చేయాలన్నారు.
ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ లను పోషకాహారం ద్వారా అందించి రక్త హీనత తగ్గించడం, హిమోగ్లోబిన్ శాతం పెంచడం న్యూట్రీషన్ కిట్ల లక్ష్యం అని స్పష్టం చేశారు. ఒక్కో కిట్కు రూ. 1962 తో రూపొందించి, ప్రభుత్వం పంపిణీ చేస్తుందని చెప్పారు. 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్సీ చెకప్ సమయంలో ఒకసారి, 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్సీ చెకప్ సమయంలో రెండో సారి ఈ కిట్లను ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. న్యూట్రీషన్ కిట్లలో న్యూట్రీషన్ మిక్స్ పౌడర్, ఖర్జూర, ఐరన్ సిరప్ 3 బాటిల్స్, 500 గ్రాముల నెయ్యి, ఆల్బెండజోల్ టాబ్లెట్, కప్పు, ప్లాస్టిక్ బాస్కెట్ లు ఇస్తున్నట్లు మంత్రి వివరించారు. ఎనీమియా నుంచి విముక్తి కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవటం ఎక్కడాలేదన్నారు. గర్బిణీలకు వరంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయన్నారు. ఇప్పటికే మాతా శిశు సంరక్షణలో భాగంగా కేసీఆర్ కిట్ల పథకాన్ని దేశంలో ఎక్కడా లేనట్లుగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని కొనియాడారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 13,90,634 మంది లబ్ధిదారులకు, రూ. 243 కోట్లు విలువ చేసే 12,85,563 కిట్లు పంపిణీ చేశామన్నారు. రూ. 1261.61 కోట్లను ఆర్థిక సాయం కింద, డీబీటీ ద్వారా ఖాతాల్లో జమ చేశామని స్పష్టం చేశారు. కేసీఆర్ కిట్ పథకం కోసం ఇప్పటి వరకు రూ. 1500 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
Share this on your social network: