కొత్త జిల్లాల తరహాలోనే కొత్త మండలాలకు భవనాలు సమకూర్చండి

Published: Tuesday October 05, 2021
 శాసన మండలి వర్షాకాల సమావేశాల్లో కోరిన మాజీ మంత్రి ఎంఎల్సీ డా.పట్నం మహేందర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 04 అక్టోబర్ ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మాజీ మంత్రి ఎంఎల్సీ డా.పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం శాసన మండలి వర్షాకాల సమావేశంలో కోరారు. ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను అన్ని మండల కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. శాసనమండలి వర్షాకాల సమావేశాల్లో భాగంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అయన ప్రశ్నోత్తరాల సమయంలో కొత్త మండల పరిషత్ లలో భవనాలు, కార్యాలయాల కోసం ప్రశ్నించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాలకు మండల పరిషత్, రెవెన్యూ తదితర కార్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 500 కోట్ల నిధులను జిల్లా మరియు మండల పరిషత్తుల నిర్మాణాల కోసం కేటాయించారని వివరించారు. త్వరలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించి విధానాలను రూపొందించి భవనాలు తదితరాలను నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించి పూర్తి చేస్తామని చెప్పారు.