రైతు బాగుంటే మనమంతా సురక్షితంగా ఉంటాం

Published: Thursday February 16, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 15 ఫిబ్రవరి ప్రజాపాలన : రైతు బాగుంటేనే మనమంతా సురక్షితంగా ఉంటామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా న్యాయమూర్తి కే.సుదర్శన్ లు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో రైతుల సమస్యలు తీర్చేందుకు,   రెవెన్యూ సమస్యలను అధిగమించేందుకు న్యాయవ్యవస్థ సహకారం ఎంతో అవసరమని   అన్నారు.   ప్రజల సమస్యలు పరిష్కరించడంలో  న్యాయవ్యవస్థ చాలా కీలక పాత్ర పోషిస్తుందని ఆ దిశగా పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.   జిల్లా కోర్టులు అందుబాటులో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని ఇందుకు  జిల్లా యంత్రాంగం సహకారం ఉంటుందని ఆయన అన్నారు. కోర్టు  సముదాయాల్లో మంచి సౌకర్యాలతో ముందుకు వెళ్దామని కలెక్టర్ అన్నారు.  భూముల రికార్డులను సరి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా న్యాయమూర్తి కే.సుదర్శన్ మాట్లాడుతూ.. భూముల సమస్యల పరిష్కారంలో మా సహకారం ఉంటుందని అన్నారు.  భూ సమస్యలు పరిష్కారం అయితే 30 శాతం సివిల్ కేసులు తగ్గుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు కే.మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి జగన్, బార్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.  
* నీటి పారుదల శాఖ,  బ్లాక్ క్వార్టర్స్ స్థలాల పరిశీలన :  

అంతకుముందు కోర్టు సముదాయానికి స్థలం సరిపోకపోవడంతో ఇబ్బంది అవుతున్న దృష్ట్యా జిల్లా జడ్జితో కలిసి నీటిపారుదల శాఖ, బ్లాక్ క్వార్టర్స్ కు కేటాయించిన స్థలాలను క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ఇట్టి స్థలాలు సర్వే చేసి నివేదికలు  సమర్పించాలని తహసిల్దారును కలెక్టర్ ఆదేశించారు.