*క్రీస్తు మార్గాన్ని అనుసరించాలి*

Published: Saturday December 24, 2022
సెమీ క్రిస్మస్ వేడుకల్లో డాక్టర్ మద్దెల*
మధిర  డిసెంబర్ 23 (ప్రజా పాలన ప్రతినిధి) ఏసుక్రీస్తు మార్గాన్ని, బోధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మధిర నియోజకవర్గం కోఆర్డినేటర్ రిటైర్డు సిఐ డాక్టర్ మద్దెల ప్రసాద రావు రాజమణి దంపతులు అన్నారు. గురువారం మందలపల్లి గ్రామంలో బైబిల్ మిషన్ చర్చి పాస్టర్ రెవరెండ్ సరిహద్దుల సువర్ణ కుమార్ నిర్మల దంపతులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సెమీ క్రిస్మస్ వేడుకలకు మద్దెల ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి మనిషి మానవ విలువలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. ఏసుక్రీస్తు మార్గమైన కరుణ, జాలి, దయ, ఓర్పు, సహనం కలిగి ఉండాలని ఆయన సూచించారు. తోటి వారిని మంచి మనసుతో ఆదరించాలని, పాపాన్ని విడిచి దైవ మార్గంలో నడిచినప్పుడే మానవతా విలువలకు అర్థం ఉంటుందన్నారు. సమాజ సేవలో భాగంగా పేదలకు మద్దెల స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన చీరలను పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దెల స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, ఖమ్మం జిల్లా కోర్టు న్యాయవాది మద్దెల నవీన్ కుమార్ దివ్య దంపతులు కుమార్తెలు మద్దెల మనస్వి, కుందన తదితరులు పాల్గొన్నారు.