నాశబోయిన నరసింహ నాన కు గ్లోబెల్ హ్యూమన్ ఎక్సలెన్సీ అవార్డ్ ప్రదానం

Published: Monday October 25, 2021
యాదాద్రి అక్టోబర్ 24 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పర్యవేక్షకులుగా విధులు నిర్వహిస్తున్న కవి, రచయిత నాశబోయిన నరసింహ నాన అంతర్జాతీయ మానవ ప్రతిభా పురస్కారం గ్లోబెల్ హ్యూమన్ ఎక్సలెన్సీ అవార్డ్ అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి దినోత్సవ వేడుకలు పురస్కరించుకొని సంస్కృతీ దౌత్య సంబంధాల అంతర్జాతీయ కమీషన్, వేఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైద్రాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ ప్రాంగణంలో జరిగిన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి దినోత్సవ వేడుకలు 2021 కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీలంక దేశానికి చెందిన మదర్ కేర్ గ్లోబల్ ఫౌండేషన్ ఆసియా చైర్మన్ డా.తర్మలింగం తారేసనన్,ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన డా.అవనింద్రకుమార్, మెడికైడెతోస్ ప్రై.లి.టెడ్ చైర్మన్ డా.శివరామ కృష్ణన్,డిప్యూటీ సిఇఓ, ఖమ్మం కే.చంద్రశేఖర్, సంస్కృతీ దౌత్య సంబంధాల అంతర్జాతీయ కమీషన్ ఐ సి సి డి ఆర్ సెక్రెటరీ జనరల్, అంబాసిడర్ డా.ఏలూరి శ్రీనివాసరావు,వే ఫౌండేషన్ ఫౌండర్ డా.పైడి అంకయ్య మొదలైన ప్రముఖుల చేతుల మీదుగా నరసింహకు గ్లోబెల్ హ్యూమన్ ఎక్సలెన్సీ అవార్డ్ ప్రదానం చేసి మెమెంటో, సర్టిఫికెట్, శాలువాతో ఘనంగా సన్మానించారు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన నరసింహ ప్రస్తుతం వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాదాద్రి జిల్లాలో ఆరోగ్య పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నారు.నరసింహ గత రెండు దశాబ్దాల కాలం నుంచి వైద్య ఆరోగ్యరంగంలో క్షేత్రస్థాయిలో వివిధ ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో గ్రామీణ ప్రజలను చైతన్యపరచడం ద్వారా వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వివిధ వైద్యారోగ్య విశిష్ట సేవలకు గుర్తింపుగా, ప్రవృత్తి పరంగా సమాజ హితం కాంక్షించే సామాజిక చైతన్యం కలిగించే సాహితీ సేవలకు గాను తనకు ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు చెప్పారు. మరో వైపు అంతర్జాతీయ మానవప్రతిభా పురస్కారం అందుకోవడం పట్ల వైద్యారోగ్యశాఖ సహోద్యోగులు, సాహితీ మిత్రులు, బంధువులు ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు.