ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జిల్లా కలెక్టర్ జి.రవి

Published: Saturday May 28, 2022

కోరుట్ల, మే 27 (ప్రజాపాలన ప్రతినిధి):
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు.  కోరుట్ల మున్సిపాలిటీ లోని మార్కండేయ కాలనీ ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద  జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో 274 పాఠశాలలు ఎంపికయ్యాయని,  ప్రస్తుతం 95 పాఠశాలలో ప్రతిపాదనలు పూర్తి చేసి పనుల గ్రౌండింగ్ చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. కోరుట్ల మున్సిపాలిటీ లోనే మార్కండేయ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షలు ఖర్చు చేసి విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్ అన్నారు. 95 పాఠశాలల్లో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు రూ.30 లక్షల లోపు ఉండటంతో పాఠశాల నిర్వహణ కమిటీలకు బాధ్యతలు అప్పగించామని కలెక్టర్ తెలిపారు.
ప్రతి పాఠశాల నిర్వహణ కమిటీ వద్ద 15% నిధులు ముందుగానే అందుబాటులో ఉంచామని, త్వరిత గతిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు మాట్లాడుతూ  పాఠశాల నిర్వహణ కమిటీ ప్రభుత్వం అందించిన నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి పనులను నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ నిర్ణయించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మార్కండేయ కాలనీ లోని ప్రభుత్వ పాఠశాలలో 24 లక్షలతో నిర్మాణం పనులు చేపడతామని, వీటికి అదనంగా పాఠశాలలో అవసరమైన ఫర్నిచర్, పెయింటింగ్ రాష్ట్ర స్థాయిలో కొనుగోలు చేసి అందజేస్తామని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం సైతం సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్నారని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.