ప్రశాంతంగా ఇంటర్మీడియెట్ పరీక్షలు

Published: Wednesday May 11, 2022
జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ 
వికారాబాద్ బ్యూరో 10 మే ప్రజాపాలన : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన అన్ని విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 17,565 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారని, ఇంటర్ మొదటి సంవత్సరం 9,350, రెండవ సంవత్సరం 8,215 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారని తెలిపారు. ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఒక్క నిమిషం కూడా ఆలస్యం కాకుండా సకాలంలో పరీక్ష కేంద్రంకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలన్నారు. జిల్లా మొత్తంలో పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడం జరుగుతుందని అయన తెలిపారు.