సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలి

Published: Friday November 04, 2022

బోనకల్ నవంబర్ 3 (ప్రజా పాలన ప్రతినిధి)  తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలని  వైయస్సార్ తెలంగాణ పార్టీ  మధిర నియోజకవర్గ కోఆర్డినేటర్ రిటైర్డ్ సీఐ డాక్టర్ మద్దెల ప్రసాదరావు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం నాటికి 3000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా బోనకల్ లో వైయస్సార్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మసీదులో నమాజ్ చేశారు. ఈ సందర్భంగా మద్దెల ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని స్థాపించడం కోసం వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. టిఆర్ఎస్ ఎనిమిదేళ్ళ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా వైయస్సార్ తెలంగాణ పార్టీని ప్రజల గుర్తించి తెలంగాణలో వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరవుతున్నారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రశ్నించే ప్రతిపక్షాలు లేకపోవడంతో వైయస్ షర్మిల ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సంక్షేమం కావాలంటే షర్మిలమ్మ రావాలి అనే నినాదంతో షర్మిలమ్మ ఆదేశాల మేరకు ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అనే కార్యక్రమాన్ని మధిర నియోజకవర్గంలో ముమ్మరంగా చేపట్టినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా మధిర నియోజకవర్గంలో గ్రామ కమిటీలను బూత్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో రైతులకు ఒకే సారి రుణమాఫీ చేశారని, పత్తి విత్తనాల ధరలను తగ్గించారని, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104, ఉచిత విద్యుత్, ప్రాజెక్టుల నిర్మాణం అర్హులైన వారికి పెన్షన్లు ఇవ్వటం లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, మైనార్టీలకు రిజర్వేషన్లు అందించారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత టిఆర్ఎస్ పాలనలో నిరుద్యోగ భృతి లేదని, రుణమాఫీ లేదని, ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం కావాలంటే షర్మిలమ్మ రావాలని నినాదాన్ని గ్రామ గ్రామాన మారుమ్రోగే విధంగా నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఇంటింటికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టిపి బోనకల్ మండల అధ్యక్షులు షేక్ మౌలానా నాయకులు కోసూరు పుల్లయ్య, నల్లమోతు నాగేశ్వరావు, షరీఫ్, షేక్ జానీ మియా, షేక్ నాగులమేరా, షేక్ నబి సాహెబ్,  జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.