మన్నెంలో నకిలీ నోట్ల కలకలం -అమాయక ఆదివాసీయులే వల్ల లక్ష్యం.

Published: Wednesday June 08, 2022
భద్రాద్రి కొత్తగూడెం:(ప్రజాపాలన బ్యూరో )భద్రాచలం మన్యంలో నకిలీ నోట్ల కలకలం రేగింది.అమాయక ప్రజలను మోసం చేస్తూ నకిలీ నోట్లను అంట కడుతున్న నకిలీ నోట్ల ముఠా గుట్టు రట్టయింది. ఈ మోసానికి పాల్పడుతున్న వివిధ ప్రాంతాలకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులను భద్రాచలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఇందుకు సంబంధించి భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజు మంగళవారం విలేకరుల సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు.అమాయక ఆదివాసీలు లక్ష్యంగా నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు.ఈ ఘటనలో చర్ల మండలం తేగడ గ్రామానికి చెందిన సిరిగిడి నగేష్, కలివేరు గ్రామానికి చెందిన బోస్ ప్రేమ్ కుమార్,గుంటూరు జిల్లా తెనాలి మండలానికి చెందిన మల్లెల వినోద్ కుమార్,కొత్తపల్లి జీవరత్నం,గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన పబ్బటి జయలక్ష్మి, చర్లకు చెందిన సయ్యద్ ఇక్బాల్, చర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గుమ్మల సర్వేశ్వర రావులతో పాటు మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు.చర్లలో గత కొద్ది రోజులుగా అమాయక ఆదివాసీ ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరంతా ఒక ముఠాగా ఏర్పడి నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తుండగా పోలీసులు పట్టుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు.వీరంతా చర్ల,చత్తీస్గఢ్ సరిహద్దు ఆదివాసి గ్రామాల నుంచి చర్ల సంతకు,కూలి పనులకు వచ్చే ఆదివాసీలు లక్ష్యంగా నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్నారని తెలిపారు.గుంటూరుకు చెందిన పబ్బటి కృష్ణతో కలిసి వినోద్ కుమార్,జీవరత్నం దొంగ నోట్లు ముద్రించి నగేష్, ప్రేమ్ కుమారులకు ఇస్తే వాటిని వారు చర్ల ఏరియాలో చలామణి చేస్తున్నారని ఏఎస్పి పేర్కొన్నారు.పబ్బటి మురళి కృష్ణను నెల్లూరు కావలి రూరల్ పోలీసులు గత రెండు నెలల క్రితం నకిలీ నోట్ల కరెన్సీకి సంబంధించిన కేసులో అరెస్టు కూడా చేయడం జరిగిందని పేర్కొన్నారు.పట్టుబడిన ఎనిమిది మంది వ్యక్తుల నుంచి నకిలీ 500 నోట్లు 551,నకిలీ 2000 నోట్లు 90,నకిలీ 200 నోట్లు 300,నకిలీ నోట్లు తయారీకి ఉపయోగించే పరికరాలను,కారును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పి రోహిత్ రాజు వెల్లడించారు.
 
 
 
Attachments area