ఉదయ కీర్తన చిట్ ఫండ్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
Published: Tuesday September 07, 2021
వికారాబాద్ బ్యూరో 06 సెప్టెంబర్ ప్రజాపాలన : కలల సాకారానికి ఆర్థిక వనరులు అత్యంతావశ్యకమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. నిరుద్యోగ సమస్యను స్వయం ఉపాధితో తీరుస్తూ ఇతరులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం అభినందనీయమని ప్రశంసించారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎంఆర్పి పెట్రోల్ బంక్ సమీపంలో ఉదయ కీర్తన చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అంతయ్యపల్లి పాండు ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం అందజేయాలని కోరారు. ఉదయ కీర్తన చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మాట్లాడుతూ.. వికారాబాద్ ప్రజలకు నాణ్యమైన నిరంతర సేవలు అందించడమే లక్ష్యంగా ఉదయ కీర్తన చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నూతన ఖాతాదారులకు ఏజెంట్ మిత్రులకు శ్రేయోభిలాషులకు సమస్త ప్రజానీకానికి హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలిపారు. ఆర్థిక అవసరాలకు అనుకూలంగా వివిధ రకాల చిట్లను అందుబాటులో ఉంచామని వివరించారు. మీ కలలను సాకారం చేసుకునేందుకు ఉదయ కీర్తన చిట్ ఫండ్ ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉదయ కీర్తన చిట్ ఫండ్స్ మేనేజ్మెంట్ సభ్యులు మహబూబ్ ఖాన్, శేఖర్, ప్రశాంత్, కరుణాకర్, శశివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: