జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అసలు ఏం జరుగుతుంది. --ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..

Published: Wednesday November 23, 2022

జగిత్యాల, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రాయికల్ మండలం జగన్నాథ్ పూర్ కు చెందిన అవుల మల్లేశ్వరి బాలింత మృతిచెందడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం  ఏరియా ఆస్పత్రికి వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఓదార్చారు.  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాల ఏరియా ఆస్పత్రి, మాతా శిశువు ఆస్పత్రి మధ్య సమన్వయం కొరవడిందని అన్నారు. మాతా శిశు ఆస్పత్రికి వైద్యులను పిలిపించి సేవలు అందించే అవకాశం ఉన్నా  ఏరియా ఆస్పత్రికి పంపిస్తుండడం తో బాలింతలు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు అన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన సమీనాకు ఆపరేషన్ చేయాలని సర్జన్ చెబుతుండగా, గతంలోని పుండు వద్ద ఇన్ఫెక్షన్ తగ్గటానికి మరికొన్ని రోజులు ఆగాలంటూ గైనకాలజిస్ట్ చెబుతుండటం వైద్యుల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతోందని ప్రభుత్వ ఆస్పత్రిలో  ప్రసవాలు పెంపొందించెందుకు  క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది ఒత్తిడి చేసి గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చుతున్నా ఆ మేరకే ఆస్పత్రిలో వైద్య సేవలు అందించడంలో సమన్వయం కరువైంది అన్నారు. ఎండి ఫిజిషియన్ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో జగన్నాథ్ పూర్ కు చెందిన మల్లేశ్వరిని ఏరియా ఆస్పత్రికి తరలించడం తో ఇన్ఫెక్షన్ తో మృతి చెందింది అన్నారు. కనీసం ఎక్స్రే, వెంటిలేటర్ కూడా అందుబాటులో లేకపోవడంతో బాలింతలను ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు అన్నారు. రెండు  ఆస్పత్రుల నిర్వహణ, సమన్వయ లోపం తో ఏం జరుగుతోందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రసవం కోసం మాతా శిశు ఆస్పత్రిలో చేరిన రాయికల్ మండలం రామోజీ పేటకు చెందిన రచన పరిస్థితి విషమించగా, గాంధీ ఆస్పత్రి లో చేరగా రికవర్ అయింది అన్నారు. ప్రసవం కోసం మాతా శిశు  ఆస్పత్రిలో చేరి  ప్రసవం తర్వాత ముగ్గురు బాలింతలు మృతి చెందడం తో మూడు కుటుంబాలు రోడ్డున పడ్డాయి అన్నారు. జగిత్యాల మండలం అంబర్ పేటకు చెందిన  రజిత, పొలాసకు చెందిన కోండ్ర రమ్య, రాయికల్ మండలం జగన్నాథ పూర్ కు చెందిన ఆవుల మల్లేశ్వరి బాలింతలు మృతి చెందడం పరిస్థితికి అడ్డం పడుతోంది అన్నారు. అస్పత్రికి అనుబందంగా మెడికల్ కళాశాల ఏర్పాటుతో వైద్య సేవలు మేరుగవ్వాల్సి ఉండగా, ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు గతంలోకన్నా రోజు రోజుకు దిగజారుతున్నాయి అన్నారు. మాతా శిశు ఆస్పత్రికి వెళ్లిన వారిని అక్కడ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో, ఏరియా ఆస్పత్రికి తరలిస్తున్నారు. మాతా శిశు ఆస్పత్రిలో 24 గంటలు స్త్రీ వైద్య నిపుణురాలు అందుబాటులో ఉండాలి అన్నారు. ఒకసారి ఆస్పత్రిలో చేరిన గర్భిణులకు, ప్రసవం అనంతరం ఎటువంటి సమస్యలు తలెత్తినా అక్కడే సేవలు అందించాలి అన్నారు.