పంజాబ్ నేషనల్ బ్యాంకు సేవలు ప్రజలకు అందుబాటులో ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **
Published: Wednesday December 28, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 27 (ప్రజాపాలన,ప్రతినిధి) :
జిల్లాలోని ప్రజలకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖను బ్యాంకు జోనల్ మేనేజర్ మహమ్మద్ మక్సుద్ అలీ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అతిపెద్ద బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖను జిల్లా కేంద్రంలో ప్రారంభించడం సంతోషంగా ఉందని,జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు సైతం బ్యాంకు సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుని జిల్లాలోని వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. అర్హత గల ప్రతి రైతుకు రుణ సదుపాయం కల్పించి అభివృద్ధి చెందేలా తోడ్పడాలని,స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణాలు అందించడం ద్వారా వారి అభ్యున్నతికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ హనుమంతరావు,పంజాబ్ నేషనల్ బ్యాంక్ సర్కిల్ అధికారి వెంకట నరేష్, శాఖ మేనేజర్ ఖాజా మొహినొద్దీన్, మాజీ ఎంపిపి బాలేష్ గౌడ్, పట్టణ ప్రముఖులు,జిన్నింగ్ మిల్లుల యజమానులు, బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: