అంధత్వ సమస్యలను పరిష్కరించుకోవాలి

Published: Friday January 27, 2023
మర్పల్లి మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు రవీందర్
వికారాబాద్ బ్యూరో 26 జనవరి ప్రజా పాలన : కంటి వెలుగు కార్యక్రమాన్ని మర్పల్లి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు నేనావత్ రవీందర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధత్వ సమస్యలతో బాధపడుతున్న బాధితులు కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చి తమ కళ్ళను పరీక్షించుకోవాలని సూచించారు. కంటి శిబిరాలలో పరీక్షించుకున్న వారికి కళ్లద్దాలు కంటిలో వేసే చుక్కల మందు కంటి జబ్బు తీవ్రంగా ఉన్నవారికి వైద్య చికిత్సకు ప్రముఖ ఆసుపత్రులకు పంపనున్నారని స్పష్టం చేశారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కంటి శిబిరాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. కంటి సమస్యలను పరీక్షించుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మర్పల్లి మండల ప్రజలు శ్రమ అనుకోకుండా ఓపికతో కంటి శిబిరాలకు వచ్చి కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.