ఎంఎంటీఎస్ రైలును వికారాబాద్ వరకు విస్తరించండి
Published: Thursday March 25, 2021
చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజీత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 24 ( ప్రజాపాలన ) : ఎంఎంటీఎస్ రైలును వికారాబాద్ వరకు విస్తరించేలా కేంద్రం తగు చర్యలు తీసుకోవాలని చేవెళ్ళ ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి తెలిపారు. బుధవారం లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో సభాపతి మిథున్ రెడ్డి ద్వారా సంబంధిత రైల్వే మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజానీకానికి రవాణా వ్వస్థ చాలా కీలకమైందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో పేర్కొన్న విధంగా హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ లను అనుసంధానo చేసే ప్రక్రియ మధ్యలో ఆగిపోయిందని గుర్తు చేశారు. ఈ మూడు కలిస్తేనే భాగ్యనగరాన్ని హైటెక్ సిటీ అంటారని వ్యాఖ్యానించారు. ఫేస్-1 మాత్రమే పూర్తి చేశారని మిగతా ఫేస్ పనులు పూర్తి కాలేదన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ తరపున తక్షణమే స్పందించి పరిష్కరించాలని అడిగారు. దాంతోపాటు, ఎంఎంటీఎస్ రైళ్ళను కేంద్రం ప్రయివేటు సంస్థలకు అప్పగించే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఒకవేళ అప్పగించాలనుకుంటే అందుకు గల ప్రధాన కారణాలు ఏంటీ? దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) కింద పని చేస్తున్న ఎంఎంటీఎస్ రైల్వేలను ప్రయివేటు, కార్పొరేటు వ్యక్తులకు అప్పగించే చర్యలు చేస్తున్నారా? అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగారు. ఎంఎంటీఎస్ లను ప్రయివేటు శక్తులకు ఇవ్వాలనుకుంటే ఈ నిర్ణయంతో వచ్చే లాభ, నష్టాలను పూర్తి వివరాలతో తెలిపండని విజ్ఞప్తి చేశారు. ఎంఎంటీఎస్ సేవలను వికారాబాద్ వరకు పొడగించే చర్యలు ఎంతవరకు వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. రైల్వే శాఖ తరపున ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, వికారాబాద్ వరకు పొడిగించే ఎంఎంటీఎస్ రైల్వే లైన్లో అన్ని ప్రదేశాల్లో స్టేషన్ల నిర్మాణానికి భూమి వెసులుబాటు ఉందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వమే నిధులు కేటాయిస్తే తమ మీద అధిక భారం వస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు.
Share this on your social network: