పల్లె ప్రగతే దేశ ఆర్థికాభివృద్ధికి పట్టుగొమ్మలు

Published: Saturday June 04, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరో 03 జూన్ ప్రజా పాలన : 
పల్లె ప్రగతి దేశ ఆర్థిక అభివృద్ధికి పట్టుగొమ్మలు అని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో జిల్లా కలెక్టర్ నిఖిల, వికారాబాద్ శాసన సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ లు పాల్గొన్నారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని పులుమద్ది గ్రామంలో గ్రామ సర్పంచ్ తిమ్మాపురం మాధవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పల్లె ప్రగతి గ్రామ సభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పులుమద్ది గ్రామానికి ఇంతకు క్రితము నిర్వహించిన పల్లె ప్రగతిలో రూ.94 లక్షలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు.  ఈసారి కూడా 15 రోజుల పాటు పల్లె ప్రగతిని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పల్లె ప్రగతిలో గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.  గ్రామాలలో నిర్మించిన వైకుంఠ ధామాలను వినియోగించుకోనాలని ప్రజలకు కలెక్టర్ సూచించారు.  ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి పారిశుద్ద్య కార్మికులకు అందించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చన్నారు.  మురికి నీరు రోడ్లపై ప్రవహించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మురికి నీరంతా ఇంకుడు గుంతలలోకి వెళ్ళేటట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.  ప్రతి రోజు మురికి కాలువలు పరిశుభ్రం చేసుకొని దోమలు, ఈగలతో వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలన్నారు.  ప్రభుత్వం అన్ని గ్రామాలకు వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు మాదిరిగా ఈసారి ప్రతి గ్రామానికి  క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు.  సర్పంచ్ తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం కొరకు ఒక ఎకరం స్థలాన్ని వెంటనే గుర్తించాలన్నారు.  గ్రామంలోని ఖాళీ స్థలాలలో, వైకుంఠ ధామల వద్ద మొక్కలు నాటి గ్రామాన్ని పచ్చగా తీర్చి దిద్దాలన్నారు.  గ్రామానికి అవసరమైన సీసీ రోడ్లు, వెటర్నరీ ఆసుపత్రి ఏర్పాటుకు త్వరలో పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ సూచించారు. 15 రోజుల పాటు జరిగే పల్లె ప్రగతి కార్యక్రమంలో అందరు పాల్గొని గ్రామాన్ని పచ్చగా, పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల కోరారు.
వికారాబాద్ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ మాట్లాడుతూ, వికారాబాద్ నియోజకవర్గంలో మీతో - నేను అనే కార్యక్రమాన్ని మొట్ట మొదటిసారిగా పులుమద్ది గ్రామం నుండే ప్రారంభించి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ గ్రామానికి వంద శాతం సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.  గ్రామ సర్పంచు కోరిక మేరకు సీసీ రోడ్లు కొరకు శాసనసభ్యులు 5 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు సభాముఖంగా ప్రకటించారు. మిషన్ భగీరథ నీటిని త్రాగడానికి వినియోగించాలని స్పష్టం చేశారు. వాటర్ ట్యాంకులను నెలకు మూడు సార్లు పరిశుభ్రం చేయాలని తెలిపారు.  ప్రతి నెల 1న, 11న మరియు 21 వ తేదీలలో తప్పనిసరిగా శుభ్రపర్చాలని తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు వాడాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు.  అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు అందరి భాగస్వామ్యంతో పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మల్గ సత్తయ్య, ఎంపిఓ నాగరాజు, గ్రామ కార్యదర్శి షాహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ అమృతమ్మ తదితరులు పాల్గొన్నారు.
* వికారాబాద్ పట్టణంలోని 4వ విడత పట్టణ ప్రగతి : 
వికారాబాద్ పట్టణంలోని 18వ వార్డు రామయ్య గూడలో జిల్లా కలెక్టర్ నిఖిల, స్థానిక శాసన సభ్యులు మెతుకు ఆనంద్ మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ లు 18వ వార్డు కౌన్సిలర్ కొండేటి కృష్ణ తో కలిసి 4వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.  వార్డులో తిరిగి సమస్యలను ప్రజలతో అడిగి తెలుసుకున్నారు.  వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మరుగుదొడ్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే వారు మరుగుదొడ్లు నిర్మించుకొనుటకు అనుమతులు మంజూరు చేస్తామన్నారు.  తడి పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలన్నారు.  వర్షాకాలంలో దోమలు, ఈగలతో వ్యాధులు ప్రబలకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. 15 రోజుల పాటు నిత్వహించనున్న పట్టణ ప్రగతిలో అందరు భాగస్వాములై వార్డును అభివృద్ధి చేసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ శరత్ చంద్ర, మున్సిపల్ ఎఇ రాయుడు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.