ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై కాంగ్రెస్ చార్జీ షీట్

Published: Saturday March 04, 2023

మానకొండూరు మార్చి03 ప్రజాపాలన విలేఖరి:

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర లో భాగంగా శుక్రవారం తిమ్మాపూర్, మానకొండూర్ లోని పలు గ్రామాల్లో పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర భోజన విరామ సమయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మానకొండూరు ఎమ్మెల్యే  రసమయి బాలకిషన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్యే అవినీతిపై మొగిలిపాలెం మాజీ సర్పంచ్ ఎలుకపెళ్లి సంపత్ ఆందోళన చేపడితే అతనిపై అక్రమంగా 54 కేసులు పెట్టించాడని, కేశవపట్నం మానకొండూరు మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పేదల కేటాయించలేదని, ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా కొత్తగా ఏర్పాటు అయిన గన్నేరువరం మండల కేంద్రం లో ప్రభుత్వ కార్యాలయాన్ని అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, గన్నేరువరం మండలంలో జర్నలిస్టులను బెదిరింపులకు గురి చేస్తే వారు సిపికి ఫిర్యాదు చేయడంతో క్షమాపణ చెప్పి తప్పించుకున్నాడని, ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయని ఎమ్మెల్యే పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ కిరణ్ రెడ్డి, డిసిసి ఉపాధ్యక్షుడు సుజిత్, మండల అధ్యక్షుడు రమణారెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.