డబ్బా పాలు వద్దు తల్లిపాలే ముద్దు

Published: Friday August 05, 2022

మధిర ఆగస్టు  4 ప్రజా పాలన ప్రతినిధి డబ్బా పాలు వద్దని తల్లిపాలే ముద్దని కౌన్సిలర్ ధీరావత్ మాధవి బంజారా కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ రాజ్యం పేర్కొన్నారు. తల్లిపాలు వారోత్సవాలు సందర్భంగా గురువారం మధిర సెక్టర్ వన్ పరిధిలోని 12వ  మెయిన్ అంగన్వాడి సెంటర్ టీచర్ అమృత ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలింతలు, గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులకు తల్లిపాలు తాగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. గర్భిణీలు  ప్రసవించిన వెంటనే బిడ్డకు ముర్రుపాలను పట్టించాలని, ముర్రుపాలు బిడ్డకు మొదటి టీకా లాంటివని వారు తెలిపారు. కనీసంగా బిడ్డకు తల్లిపాలను ఆరు నెలల పాటు పట్టించాలని, ఏడు నెలల నుండి మాత్రమే పిల్లలకు ఇతర ఘన పదార్థాలను అందిస్తూ రెండు సంవత్సరాల వరకు తల్లిపాలను అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజు మెప్మా ఆర్పి కృష్ణవేణి ఆశా వర్కర్ లీల గర్భిణీలు బాలింతలు, చిన్నపిల్లల తల్లులు తదితరులు పాల్గొన్నారు.