బాలికల్లో నైపుణ్య వికాసానికి ఎఫ్ఎల్ఒ చేయూత

Published: Saturday June 12, 2021
చేవెళ్ళ ఎంపి సతీమణి సీతారంజిత్ రెడ్డి
వికారాబాద్, జూన్ 11, ప్రజాపాలన బ్యూరో : ఒక వైపు లాక్ డౌన్. పాఠశాలలు కొనసాగడం లేదు. తరగతులు కూడా ఆన్ లైన్ లో నిర్వహిస్తూ వుండటంతో పిల్లలు ముఖ్యంగా బాలికలు ఎటు వెళ్లకుండా ఇంట్లోనే వుంటూ.. స్మార్ట్ ఫోన్, సామాజిక మాధ్యమాలు, ఇతర వ్యాపకాల్లో గడుపుతున్నారు. పల్లెల అభివృద్ధిలో తెలంగాణ ఆడబిడ్డలు ప్రధాన పాత్ర వహిస్తారని గ్రహించిన చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి సతీమణి సీతారంజిత్ రెడ్డి సహకారంతో బాలికల్లో పాఠశాల స్థాయి నుండే వారిలో నైపుణ్య వికాసానికి(స్కిల్ డెవలప్ మెంట్) ఉపయోగపడే కమ్యూనికేషన్ స్కిల్స్ వర్క్ షాప్ నిర్వహించడానికి ఎఫ్ఎల్ వో(ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) సంస్థ ముందుకొచ్చింది. ఇందులోభాగంగా వికారాబాద్ జిల్లా ప్రభుత్వ పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ నెల 7 నుండి11 వ తేదీ వరకు వర్క్ షాప్స్ చేపట్టారు. మొదట వీటిని జిల్లాలోని వికారాబాద్, పరిగి, కుల్కచర్ల మండలాల్లో  ఆ పాఠశాలల హెడ్ మాస్టర్ ల పర్యవేక్షణలో నిర్వహించారు. నాలుగు రోజుల పాటు చేపట్టిన ఈ వర్కుషాప్స్ లో దాదాపు 200 మందికి పైగా విద్యార్థినులు పాల్గొన్నారు. వ్యక్తిత్వ వికాస రంగంలో దాదాపు 20 సంవత్సరాల అనుభవం కలిగిన అర్షియా, మంజుషాలచే వర్క్ షాప్స్ నిర్వహించినట్లు ఫిక్కీ ఛైర్ పర్సన్ ఉమా చిగురుపాటి తెలిపారు. అలాగే మూడు మండలాలకు చెందిన హెడ్ మాస్టర్స్ వెంకటయ్య, కృష్ణా రెడ్డి, కవితల నేతృత్వంలో ఈ వర్క్ షాప్స్ జరిగాయని విద్యార్థలు, వారి తల్లిదండ్రుల నుండి మంచి స్పందన వచ్చినట్లు సీతా రంజీత్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్ లో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు కూడా ప్రతీ పల్లెలో నిర్వహించేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.