శిశు సంరక్షణ ఆరోగ్యంపై తల్లులకు అవగాహన

Published: Thursday November 11, 2021
యాదాద్రి నవంబర్ 10 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : చిన్నారుల ఆరోగ్య పర్యవేక్షణలో మాతృ సంరక్షణ కూడా ఒక భాగమని, తల్లి ఆరోగ్యానికి, శిశు ఆరోగ్యానికి అవినాభావ సంబంధం ఉందని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుమన్ కళ్యాణ్, ఆరోగ్య పర్యవేక్షకుడు నాశబోయిన నరసింహ అన్నారు. బుధవారం వేములకొండ గ్రామంలోని ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన హెల్త్ బేబీ షో ఆరోగ్య చిన్నారి పోటి కార్యక్రమంలో వారు పాల్గొని శిశు సంరక్షణ - ఆరోగ్యం పై తల్లులకు అవగాహన కల్పించారు.అరోగ్యంగా ఉన్న తల్లి పరిరక్షణలో పిల్లల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందన్నారు.వ్యక్తిగత,పరిసరాల పరిశుభ్రత లేకపోవడం,పౌష్టికాహార లోపం,సరియైన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు తీసుకోకపోవడం వల్ల పిల్లలకు జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. పిల్లల బరువు, పెరుగుదల అభివృద్ధి ప్రతి నెల గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా 5ఏళ్ళ లోపు చిన్నారులకు నిర్వహించిన ఆరోగ్య చిన్నారి పోటీలో ఐదుగురు విజేతలకు బహుమతులు అందజేశారు. బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టించాలన్నారు. ఏడు నెలల నుండి మెత్తగా చేసిన తృణ ధాన్యాలు, కిచిడి, పప్పు ధాన్యాలతో పిల్లలకు ఆహారం తినిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యమిత్ర సలబాద్రి మహేందర్, హెల్త్ అసిస్టెంట్ జే.వినోద, ఆశా కార్యకర్తలు క్రిష్ణవేణి, సూర్యకళ, అంగన్వాడీ టీచర్లు శారద, సువర్ణ, చరణ్, సతీష్, బ్రహ్మచారి, శ్రీదేవి, తల్లులు తదితరులు పాల్గొన్నారు.