మన ఊరు మనబడి పనులన్నీ పూర్తి చేయాలి

Published: Saturday November 19, 2022
జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ
వికారాబాద్ బ్యూరో 18 నవంబర్ ప్రజా పాలన : మన ఊరు మనబడి కార్యక్రమం కింద చేపట్టిన పనులన్నింటిని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు సూచించారు
శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో మన ఊరు మనబడి కార్యక్రమం పురోగతిపై సంబంధిత అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో మన ఊరు మనబడి కింద ఎంపికైన 371 పాఠశాలల్లో ఇప్పటికే పనులు పూర్తయినవని చెప్పారు. ఇంకా గ్రౌండింగ్ కానీ పాఠశాల  వివరాల గురించి అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. ధారూర్ మండలంలో గ్రౌండింగ్ లో  వెనుకబడి ఉన్న దృష్ట్యా కేటాయించిన శాఖ ద్వారా వెంటనే పనులు చేపట్టాలని ఆయన ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల జాబితాను సమర్పించాలని సూచించారు. పనులు పూర్తయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే అంచనాలు సమర్పించిన పనులకై పరిపాలనాపరమైన మంజూరు తీసుకోవాలని ఆయన తెలిపారు. తక్కువ ఖర్చుతో కూడిన పాఠశాలల మరమ్మతుల పనులు పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి,  పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ  ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు, ఆర్అండ్ బి ఏఇ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.