లబ్దిదారులకు భీమా చెక్కు అందజేసిన జిల్లా కలెక్టర్

Published: Saturday February 11, 2023
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 10, ప్రజాపాలన  :
 
టాటా ఎ.ఐ.ఎ. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా పాలసీ తీసుకొని మృతి చెందిన భుక్య రాజ్ నాయక్ భార్య భుక్య శారదకు భీమా చెక్కు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో టాటా ఎ.ఐ.ఎ. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ మేనేజర్ సూర రామకృష్ణారెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ సుమలతరెడ్డితో కలిసి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్-2021లో భుక్య రాజు నాయక్ టాటా ఎ.ఐ.ఎ. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పాలసీ తీసుకొని 2వ సంవత్సరంలో అనారోగ్య కారణంగా మృతి చెందాడని, సంస్థ ప్రతినిధులు ఈ విషయమై స్పందించి వేగంగా భీమా చెల్లింపు చేయడం అభినందనీయమని అన్నారు. ఇంటి యజమాని భీమా తీసుకోవడం ద్వారా ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు కుటుంబానికి భరోసా ఉ ంటుందని, పిల్లల చదువులకు ఇబ్బందులు లేకుండా, ఆర్థిక సమస్యలు తలెత్తకుండా ప్రశాంత జీవనం గడిపేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టాటా ఎ.ఐ.ఎ. లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.