బీసీలకు టికెట్ ఇవ్వకుంటే మునుగోడులో ముంచేస్తాం -------రాచాల యుగంధర్ గౌడ్
Published: Friday September 16, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీసీ అభ్యర్థికి ఇవ్వకుంటే కేసీఆర్ ను ముంచేస్తామని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పేర్కొన్నారు.
గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ పాలనలో కెసిఆర్ బీసీలకు ఓరగబెట్టింది ఏమీ లేదన్నారు.
కులవృత్తుల ఆధారంగా జీవనోపాధి సాగిస్తున్న బీసీలకు ప్రత్యామ్నాయం చూపించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యరని ఆరోపించారు.
గొర్లు, బర్లు, చేపలు అంటూ బీసీలను అవహేళన చేస్తున్నాడని, కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకురావాలని ఆలోచించకపోవడం దురదృష్టకరమన్నారు.
చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. అలాగే నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. 8 ఏళ్ల కెసిఆర్ పాలనలో బిసి, ఎంబిసి కార్పొరేషన్లకు పాలకమండల్లు నియమించడంలో నాన్చుడు ధోరణి వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు.
బీసీ సబ్ ప్లాన్ పై నోరు మెదపకపోవడం బీసీలకు అన్యాయం చేయడమేనని, గురుకులాలు కళ్యాణ లక్ష్మి పథకాలతో ఎమ్మెల్యేల చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీసీ మంత్రిత్వ శాఖ కేవలం గురుకులాలకే పరిమితం చేయడం కెసిఆర్ కే చెల్లిందని,సీఎం కేసీఆర్ బీసీలకు సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మీ వివక్షతను గమనిస్తున్నామని, బీసీలు నిశ్శబ్ద విప్లవకారులని, సమయం వచ్చినప్పుడు బొంద పెట్టేందుకు కూడా వెనకాడమని, మునుగోడులో 70 శాతం బీసీలు ఉన్న సంగతిని కెసిఆర్ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
సమావేశంలో దూదేకుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సత్తార్ సాహెబ్, తెలంగాణ సామాజిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోటికె రాము, శశికుమార్ గౌడ్,మహీందర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: