నాగరాజు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి

Published: Wednesday May 18, 2022
ఎఐఎంఐఎం నాయకుడు మిర్జా ఫెరోజ్ బేగ్
వికారాబాద్ బ్యూరో 17 మే ప్రజా పాలన : హైదరాబాదులోని సరూర్ నగర్ లో పరువు హత్యకు గురైన నాగరాజు కుటుంబ సభ్యులకు రాబోవు ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఎఐఎంఐఎం నాయకుడు మిర్జా ఫెరోజ్ బేగ్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ నియోజక పరిధిలోని మర్పల్లి మండలానికి చెందిన నాగరాజును పరువు హత్య చేసినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇంతవరకూ నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన వారు ఆర్థికంగా ఆదుకున్న పాపాన పోలేదని జెపి పొడిచారు. పరువు హత్య గావింపబడిన నాగరాజు కుటుంబ సభ్యులకు సరైన న్యాయం జరగాలంటే రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే మార్గమని సూచించారు. నాగరాజు కుటుంబ సభ్యులను ప్రజా సంఘాలు కుల సంఘాలు రాజకీయ పార్టీలు ఒకరిని మించి మరొకరు పోటీ పడి సందర్శించి పరామర్శిస్తున్నారే తప్ప న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నీటి ఆవేదన ఓదార్పు కంటే రాజకీయంగా బలపడేందుకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవడమే మేలని హితవు పలికారు.