వైఎస్ షర్మిల కొడంగల్ పాదయాత్రను విజయవంతం చేద్దాం

Published: Monday August 08, 2022
జిల్లా వైఎస్సార్ టిపి అధ్యక్షులు తమ్మలి బాలరాజ్
వికారాబాద్ బ్యూరో 7 ఆగస్టు ప్రజా పాలన : 
గడప గడపకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని చేర్చాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా వైఎస్సార్ టిపి అధ్యక్షులు తమ్మలి బాలరాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లిలో వై.ఎస్.ఆర్.టి.పి కార్యాలయంలో వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ పి సుధారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వై.ఎస్.ఆర్.టి.పి వ్యవస్థాపకురాలు వైఎస్ షర్మిల ఈనెల తొమ్మిదవ తేదీ నుండి 13వ తేదీ వరకు పాదయాత్ర చేపట్టనున్నారని పేర్కొన్నారు. షర్మిల అక్క పాదయాత్రను విజయవంతం చేయడానికి వైఎస్సార్ అభిమానులు తండోపతండాలుగా తరలి రావాలని కోరారు. షర్మిల అక్క ఆధ్వర్యంలో వైఎస్సార్టిపి జెండా ఎగరవేయనున్నదని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వ కుటుంబ పాలనకు చరమగీతం పాడి ఒక మహిళా ముఖ్యమంత్రిగా షర్మిలను చూడాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. రోజురోజుకు వై.ఎస్.ఆర్.టి.పి బలోపేతం అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని టిఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి తదితర పార్టీల నుండి కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీలో చేరుతున్నారని వెల్లడించారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు గౌరవము లభిస్తుందని భరోసా ఇచ్చారు. జిల్లాలో వైఎస్ఆర్టిపి జెండా ఎగర వేయడానికి ప్రతి కార్యకర్త నడుము బిగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి కార్యకర్త మనోధైర్యంతో పార్టీ సిద్ధాంతాలను నియమాలను తూచా తప్పకుండా వివరించాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్టీ సెల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అంజలి మాన్ సింగ్ నాయక్, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కే రాములు, వికారాబాద్ మండల్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుమార్ వికారాబాద్ మండల్ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి రవి వైఎస్సార్ టిపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.