కార్పొరేట్ సంస్థలకు అండగా కేంద్ర బడ్జెట్..
Published: Thursday February 03, 2022
కూచిపూడి వెంకటేశ్వరరావు విమర్శ..
తల్లాడ, ఫిబ్రవరి 2 (ప్రజాపాలన న్యూస్): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రం ఆశించిన నిధులు కేటాయించక చిన్న చూపు చూడటం భాధాకరమని తెలుగు దేశంపార్టీ తల్లాడ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు అన్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత బుధవారం ఆయన మాట్లాడుతూ మరోసారి వేతన జీవులను నిరుత్సాహ పరిచిందన్నారు. సామాన్యుడి స్థితిగతులను పరిగణలోకి తీసుకోకపోవడం నిరాశే మిగిల్చిందన్నారు. వ్యవసాయ రంగానికి పేలవంగా నిధులు కేటాయింపులు లేవన్నారు. నిత్యవసర వస్తువుల పై ఫోకస్ లేకపోవడం, మౌలిక వసతుల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కార్పొరేట్ శక్తులు అయినా అంబానీ, ఆదానీలకు మేలు చేసే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఎద్దేవా చేశారు. దేశంలో బిజెపి, తెలంగాణలో టిఆర్ఎస్ దొందూ దొందేనని అన్నారు. ఈ బడ్జెట్ తో రైతులు, సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఒరిగిందేమీ లేదు నిరాశ తప్ప. రాష్ట్రానికి ఈ ఏడాది 42 వేల కోట్ల బడ్జెట్ వస్తాయని ఆశిస్తే తెలంగాణకు మొండిచెయ్యి చూపి నిరాశే మిగిల్చింది. విద్య వైద్య, రంగాల పట్ల కేంద్రానికి ఈ వివక్ష తగదు. కేంద్ర ప్రభుత్వం పై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ పార్లమెంట్ బడ్జెట్ ప్రసంగాన్ని ఎంపీలతో బహిష్కరించడం తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు. ఈ డ్రామాలు తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఏది ఏమైనా ఈ బడ్జెట్ వలన తెలంగాణ ప్రజల ఆశలు ఫలించలేదు. తెలంగాణ ప్రజల ఆశలు సాధించడంలో టిఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
Share this on your social network: