ఉపాధ్యాయుడి పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి.
Published: Wednesday January 18, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 17, ప్రజాపాలన : నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి పై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్మిక, ప్రజా, రైతు,సామాజిక సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు దళితుల పైన కులం, మతం, ప్రాంతం, ఆహార అలవాట్లు అంటూ అన్నింటి పై దాడులు పెరిగిపోయని, తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కోటగిరి లో ప్రభుత్వ పాఠశాలలో శాస్త్రియత ను బోధించే మల్లికార్జున్ అనే టీచర్ పై మతోన్మాద గుండాలు మతం పేరుతో దాడి చేసి పాఠశాల నుండి గుడి తీసుకెళ్లి చాలా దారుణంగా అవమానించిన ఘటన దేశంలో మనకున్న రాజ్యాంగ హక్కులను కలరస్తూ, ఇలాంటి ముఖ దాడులకు పాల్పడుతున్నా వారిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేయక పోవడం చాలా దారుణం అని మండిపడ్డారు. విద్యార్థిని ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దేది ఒక ఉపాధ్యాయుడు కానీ అలాంటి ఉపాధ్యాయుడి పై దాడి చేయడం చాలా సిగ్గు చేటు అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో దుంపల రంజిత్ కుమార్, సంకె రవి, డూర్కే మోహన్, గుర్రాల రాజా, వేణు, మోతె జయకృష్ణ, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: