రావిర్యాల కాంగ్రెస్ సభను విజయవంతం చేద్దాం

Published: Tuesday August 17, 2021
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టి.రాంమోహన్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 16 ఆగస్ట్ ప్రజాపాలన : రావిర్యాలలో జరిగే కాంగ్రెస్ పార్టీ సభను విజయవంతం చేయుటకు ప్రతి కార్యకర్త తరలి రావాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టి.రాంమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణ కేంద్రంలోని సత్యభారతి వేడుక వేదికలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇబ్రాహింపేట్ మండలంలోని రావిర్యాల గ్రామంలో ఎస్సీ ఎస్టీ దళిత ఆత్మ గౌరవ సభను విజయవంతం చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. 2 లక్షల కోట్ల రూపాయలతో దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామనడం హాస్యాస్పదమని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రం 3 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నదని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్ళ దళితులకు దళిత సంధు అమలు చేయాలంటే రాబోవు తరానికి చెందిన ఆస్థులను కూడా తాకట్టు పెట్టాల్సి ఉంటుందని దెప్పి పొడిచారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టారని చెప్పారు. 18వ తేదీన రావిర్యాలలో జరిగే దళిత గిరిజన ఆత్మ గౌరవ సభతో కాంగ్రెస్ పార్టీకి బూస్టులా పని చేస్తుందన్నారు. టిఆర్ఎస్ పార్టీకి దళితులు వ్యతిరేకంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం కారణంగా దళిత బంధును తెచ్చారని విమర్శించారు. ప్రతి దళిత కుటుంబంలో వెలుగు నింపడానికి రావిర్యాల సభను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ శాసన సభ్యుడు విజయ రామారావు, పటేల్ రమేష్ రెడ్డి, సుభాష్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, పిఏసిఎస్ మాజీ ఛైర్మన్ కిషన్ నాయక్, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు రత్నారెడ్డి, ధారూర్ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వికారాబాద్ ఎంపిపి కామిడి చంద్రకళ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పెండ్యాల అనంతయ్య, వికారాబాద్ మండల కో ఆప్షన్ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, పూడూరు మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.